
- స్టేట్ ఇంజినీర్స్ అసోయేషన్ ఆధ్వర్యంలో ఇంజినీర్స్ డే వేడుకలు
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ ఇంజినీర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ అన్నారు. సోమవారం (సెప్టెంబర్ 15) స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీజీపీఈఏ) ఆధ్వర్యంలో జెన్కో ఆడిటోరియంలో 58వ ఇంజినీర్స్ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నవీన్ మిట్టల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నూతన నియామకాలు, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ విధానం, జీపీఎఫ్ సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రెన్యువబుల్ ఎనర్జీ ఇన్స్టాల్ కెపాసిటీ.. సంప్రదాయ ఇంధన సామర్థ్యాన్ని మించిపోయిందన్నారు. బ్యాటరీ స్టోరేజీ వ్యవస్థ ద్వారా కరెంటు ధరలను నియంత్రించవచ్చని తెలిపారు. ఇంధన రంగానికి కేంద్ర-, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయని, విద్యుత్ నెట్ వర్క్ వేగంగా విస్తరిస్తోందన్నారు.
నెట్ వర్క్ వైఫల్యం లేకుండా కరెంటు సరఫరా
సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫారుకీ మాట్లాడుతూ హైదరాబాద్లో కుండపోత వర్షాలు కురుస్తున్నా ఇంజినీర్లు, సిబ్బంది కృషితో నెట్ వర్క్ వైఫల్యం లేకుండా కరెంటు సరఫరా సాధ్యమవుతోందన్నారు. హైదరాబాద్లో సంపూర్ణ అండర్గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
పవర్ ఇంజి నీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నాకర్ రావు మాట్లాడుతూ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి నాయకత్వంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా జరుగుతోందన్నారు. నెట్వర్క్ అభివృద్ధికి తగినట్లుగా మానవ వనరుల నియామకాలు జరిగితే నిరంతర విద్యుత్ సరఫరాకు మరింత సహాయపడుతుందన్నారు.