ఆదిలాబాద్టౌన్, వెలుగు: బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇచ్చిందని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు రూ.5 వేల కోట్లు కేటాయించడం అభినందనీయమని పేర్కొన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా పథకం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఏటీసీ కేంద్రాల్లో చదువుకునే ఐటీఐ విద్యార్థులకు నెలకు రూ.2,000ల స్టైఫండ్ అందించడం హర్షనీయమన్నారు. జిల్లాలోని సాత్నాల ప్రాజెక్ట్ కు రూ.కోటి, మత్తడి వాగు ప్రాజెక్ట్ కు రూ.4.62 కోట్లు, సీఆర్ఆర్ చనాక-కొరట బ్యారేజ్ పనులకు రూ.177.54 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అందులో రూ.90 కోట్లు భూసేకరణకు, రూ.87 కోట్లు అదనపు నిర్మాణాలకు కేటాయించినట్లు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవదాస్ చారి, జనరల్ సెక్రటరీ సంజయ్ కుమార్, కార్యదర్శి సిరాజ్ పాల్గొన్నారు.
