బెంగాల్ బీజేపీ ప్రెసిడెంట్‌పై తృణమూల్ మద్దతుదారుల దాడి

బెంగాల్ బీజేపీ ప్రెసిడెంట్‌పై తృణమూల్ మద్దతుదారుల దాడి

కలకత్తా: వెస్ట్ బెంగాల్ బీజేపీ ప్రెసిడెంట్ దిలీప్ ఘోష్‌పై అధికార తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు దాడికి తెగబడ్డారు. బుధవారం రాజార్‌‌హట్‌లో మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన దిలీప్‌పై తృణమూల్ పార్టీ సపోర్టర్స్ అటాక్ చేశారు. ఆయనను కాపాడటానికి యత్నించిన పర్సనల్ సెక్యూరిటీపై కూడా నిందితులు దాడి చేశారు. అలాగే దిలీప్ వెహికిల్‌ను ధ్వంసం చేశారు. దీనిపై దిలీప్ ఘోష్‌ స్పందిస్తూ.. ‘ప్రస్తుతం నేను రాజర్‌‌హట్‌–న్యూటౌన్ ఏరియాలో ఉంటున్నా. ఎప్పటిలానే ఇవ్వాళ కూడా ఉదయం బయటికి వెళ్లా. కొచ్పుకూర్‌ విలేజ్‌‌లో మా పార్టీ కార్యకర్తలు నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను అక్కడికి చేరుకోవడానికి ముందే తృణమూల్ సపోర్టర్స్ నాతోపాటు సెక్యూరిటీ గార్డ్స్‌పై అటాక్‌కు దిగారు. ఈ ప్రాంతానికి నేను వస్తున్నట్లు లోకల్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చాం. కానీ వాళ్లు ఏమీ చేయలేదు. దీన్ని బట్టి బెంగాల్‌లో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో మీరు ఊహించుకోవచ్చు. నేనంటే తృణమూల్ కాంగ్రెస్‌కు ఎందుకంత భయమో తెలీదు’ అని దిలీప్ చెప్పారు. ఈ ఘటనను ఖండిస్తూ కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి స్పందించారు. ‘చాలా మందికి బీజేపీ సిద్ధాంతాలు నచ్చకపోవచ్చు. కానీ ఘోష్ మీద జరిగిన దాడి ఆమోదయోగ్యం కాదు’ అని రంజన్ చౌదరి పేర్కొన్నారు.