
- సెన్సెక్స్ వరుసగా నాల్గో సెషన్లో, నిఫ్టీ వరుసగా ఏడో సెషన్లో పైకే
- అమెరికాతో వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని ఆశ
- ఐటీ, ఆటో, కన్స్యూమర్ డిస్క్రిషనరీ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్
- కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు
ముంబై: అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాల మధ్య, గ్లోబల్ మార్కెట్లతో పాటే మన మార్కెట్లు కూడా గురువారం లాభాల్లో కదిలాయి. బెంచ్మార్క్ బీఎస్ఈ సెన్సెక్స్ 123 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 50 ఇండెక్స్ 25,000 వేల పైన స్థిరపడింది. సెన్సెక్స్ వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగియగా, నిఫ్టీకి ఇది వరుసగా ఏడో సెషన్ లాభం. సెన్సెక్స్ గురువారం 123.58 పాయింట్లు
(0.15 శాతం) పెరిగి 81,548.73 వద్ద సెటిలయ్యింది.
ఇంట్రాడేలో ఇది 217.07 పాయింట్లు పెరిగి 81,642.22 వరకు చేరింది. నిఫ్టీ 32.40 పాయింట్లు(0.13 శాతం) పెరిగి 25,005.50 వద్ద ముగిసింది. ఇది మూడు వారాల గరిష్ట స్థాయి. సెన్సెక్స్ కంపెనీలలో ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, ఎటర్నల్, సన్ ఫార్మా షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. మరోవైపు ఇన్ఫోసిస్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్తాన్ యూనిలీవర్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
ఎనలిస్టులు ఏమంటున్నారంటే?
జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ మాట్లాడుతూ, “నిఫ్టీ50 కీలక స్థాయి అయిన 25 వేల పైన ముగిసింది. అమెరికా భారత్పై 50 శాతం టారిఫ్ విధించడం వల్ల ఇది 24,400కి పడిపోయింది. అయితే, వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాలు సానుకూల సంకేతాలు ఇవ్వడంతో మార్కెట్ పెరుగుతోంది” అని అన్నారు.
“మార్కెట్లు గురువారం డల్గా ట్రేడై స్వల్ప లాభాలతో ముగిశాయి. సానుకూలంగా ప్రారంభమైన నిఫ్టీ, ట్రేడింగ్ మొత్తం చిన్న రేంజ్లో కదలాడింది” అని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా అన్నారు.
రంగాల వారీగా..
ఎనర్జీ, ఫార్మా రంగాలు టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఐటీ, ఆటో రంగాల్లో లాభాల స్వీకరణ జరిగింది. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.14 శాతం పెరగగా, స్మాల్క్యాప్ సూచీ స్థిరంగా ముగిసింది. ఆయిల్ అండ్ గ్యాస్ (1.19శాతం), పవర్ (1.06శాతం) , ఎనర్జీ (0.96శాతం), యుటిలిటీస్ (0.95శాతం) , సర్వీసెస్ (0.59శాతం), టెలికమ్యూనికేషన్ (0.55శాతం) ఇండెక్స్లు లాభాల్లో క్లోజయ్యాయి. బీఎస్ఈ ఫోకస్డ్ ఐటీ, ఐటీ, టెక్, ఆటో, కన్స్యూమర్ డిస్క్రిషనరీ ఇండెక్స్లు నష్టపోయాయి.
గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 837.97 పాయింట్లు (1.03 శాతం) పెరిగింది. నిఫ్టీ 7 ట్రేడింగ్ రోజుల్లో 290.45 పాయింట్లు (1.17 శాతం) లాభపడింది. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పీ, జపాన్ నిక్కీ 225, చైనా షాంఘై ఎస్ఎస్ఈ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. హాంగ్కాంగ్ హాంగ్సెంగ్ నష్టాల్లో క్లోజయ్యింది. యూరప్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) బుధవారం రూ.115.69 కోట్లు విలువైన షేర్లను విక్రయించగా, గురువారం మరో రూ.3,400 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. బ్రెంట్ క్రూడ్ 0.24 శాతం తగ్గి బ్యారెల్కు 67.28 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.