
హైదరాబాద్, వెలుగు: కేంద్రం తీసుకొస్తున్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) డ్రాఫ్ట్లో కొన్ని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఇందులో ఏదో కుట్ర దాగున్నట్టు అనుమానం కలుగుతోందని విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. కొత్త పాలసీ తీసుకొచ్చేటప్పుడు అందరినీ ఇన్వాల్వ్ చేయాలని, ఆమోదయోగ్యమైతేనే ఇంప్లిమెంట్ చేయాలన్నారు. కేంద్రం నిధులిస్తే చాలని, అమలు బాధ్యత రాష్ట్రం చూసుకుంటుందన్నారు. రాష్ట్రంలో విద్యావిధానంపై త్వరలో సీఎం కేసీఆర్ వర్క్షాప్ నిర్వహించనున్నట్టు మంత్రి చెప్పారు. హైదరాబాద్లోని ఆస్కీలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి అధ్యక్షతన ‘జాతీయ విద్యావిధానం -2019 డ్రాఫ్ట్’పై మంగళవారం వర్క్షాప్ జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్రపై ఎన్ఈపీలో పేర్కొనలేదని మంత్రి అన్నారు.
విద్యాశాఖకు సంబంధించిన ఓ కమిటీకి పీఎం చైర్మన్గా ఉండడం ఏంటని ప్రశ్నించారు. ఓ మారుమూల ప్రాంతంలో ఎలాంటి విద్యావిధానం ఉండాలో కేంద్రం నిర్ణయించడం సరికాదని, దాన్ని రాష్ట్రాలకు వదిలేయాలన్నారు. ఎన్ఈపీపై మరింత అధ్యయనం కోసం మరో నెల సమయం కావాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ విజయ్ కుమార్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్కుమార్, విద్యావేత్తలు నర్సింహారెడ్డి, ఉపేందర్రెడ్డి, ఆదినారాయణ, సి.రామచంద్రయ్య, విద్యాశాఖ అధికారులు, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, స్వచ్చంధ సంస్థ ప్రతినిధులు, టీచర్లు, స్టూడెంట్స్ పాల్గొని మాట్లాడారు.
విద్యను ప్రైవేట్పరం చేసేలా ఉంది
జాతీయ విద్యాపాలసీ డ్రాఫ్ట్ పూర్తిగా విద్యను ప్రైవేటీకరణ చేసేలా ఉంది. ఎన్ఈపీ 53 పేజీల సంక్షిప్త డ్రాఫ్ట్ చదివితే చాలా బాగుందనిపిస్తోంది.. కానీ మొత్తం 474 పేజీల డ్రాఫ్ట్ చదివితే అసలు విషయం బయటపడుతోంది. రాజ్యాంగ లక్ష్యాలను అమలు చేసేలా విద్యావిధానం లేదు. లౌకికతత్వం, సమానత్వం లాంటి పదాలే దాంట్లో లేవు. మల్టీనేషనల్ కంపెనీలకు స్టూడెంట్స్ను ఎలా తయారు చేసివ్వాలనేదే అందులో ఉంది.
– ఎ.నర్సిరెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ
క్లాస్కో టీచర్ ఉండాలి
ప్రీ ప్రైమరీ క్లాసులను ప్రైమరీ స్కూల్స్లో ఏర్పాటు చేయాలి. తరగతి గదికో టీచర్ను ఏర్పాటు చేయాలి. దీనికి కొన్ని సవరణలు అవసరం. ఎడ్యుకేషన్ అనేది విద్యార్థులను అన్ని కోణాల్లో తీర్చిదిద్దేలా ఉండాలి.
– రఘోత్తంరెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ
అవసరమైన అంశాల్నే తీసుకోవాలి
డ్రాఫ్ట్ శాస్ర్తీయంగా లేదు. దీన్నించి అవసరమైన అంశాలనే తీసుకునే విధానం ఉండాలి. దీంట్లో రాజ్యాంగ అంశాలను పొందుపర్చలేదు. ఇది చాలా ప్రమాదకరం. 2045 నాటికి 50 శాతం ఉద్యోగాలు కంప్యూటర్పైనే ఉంటాయి. ఇలాంటి సమయంలో సంస్కృతం నేర్చుకుని ఏం ఉపయోగం?
– ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, గురుకుల సొసైటీ సెక్రటరీ