అయోధ్య రాముడిని రామ్‌లల్లాగా ఎందుకు పిలుస్తారో తెలుసా...

అయోధ్య రాముడిని రామ్‌లల్లాగా ఎందుకు పిలుస్తారో తెలుసా...

దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా  ఇప్పుుడు అయోధ్య రామాలయం మాటే ఎక్కువగా విన్పిస్తోంది. మీడియాలోనూ రామమందిరం ప్రారంభోత్సవం, ప్రత్యేకతలు వంటి ప్రసారాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన అనే పదం తెలుగు ప్రజల్ని అయోమయానికి గురి చేస్తోంది. రాముడు అనకుండా రామ్‌లల్లా అని ఎందుకంటున్నారు, ఈ రెండూ ఒకటి కాదా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఆ సందేహాలకు సమాధానం ఇక్కడ చూద్దాం.

అయోధ్యలో మరి కొద్దిరోజుల్లో అంటే జనవరి 22వ తేదీన రామమందిరం ప్రారంభం కానుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశ విదేశాల్నించి వీవీఐపీలు తరలి రానున్నారు. భారీగా భక్తజనం అయోధ్యకు చేరుకోనున్నారు. జనవరి 22వ తేదీ మద్యాహ్నం 12.30 గంటలకు రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుందనే వార్తలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో రామ్‌లల్లా అంటున్నారేంటనే సందేహాలు తలెత్తుతున్నాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనకుండా రామ్‌లల్లా అనే పేరేంటనేది ప్రధాన సందేహంగా మారింది. ముఖ్యంగా తెలుగువారిలో ఈ సందేహం ఉంది. శ్రీరాముడు, రామ్‌లల్లా ఒకటి కాదా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. 

బాల్య దశలో చాలామందికి నిక్​ నేమ్స్​ ఉంటాయి.  ముద్దు ముద్దు పేర్లతో ఎంతో ఆప్యాయంగా పిలుస్తారు.  అయోధ్య శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలమని పురాణాలు చెబుతున్నాయి.   శ్రీరాముడిని బాల్యంలో బాల రాముడి అని పిలిచారట.  ఉత్తరాది ప్రజలు రామ్​లల్లా అంటారు. 

వాస్తవం ఏంటంటే రామ్‌లల్లా అంటే బాల రాముడు అని అర్ధం. అయోధ్యలో ప్రతిష్ఠిస్తున్నది రాముడి బాల్యావస్థ విగ్రహాన్ని. అంటే బాలరాముడి విగ్రహాలను.  రామచరిత మానస్ రచించిన తులసీదాస్ బాల రాముడిని రామ్‌లల్లాగా అభివర్ణించారు. అందుకే ఉత్తరాదిన బాలరాముడిని రామ్‌లల్లాగా పిలుస్తారు. శ్రీరాముడికి 5-6 ఏళ్ల వయస్సు ఉన్నంతవరకూ రామ్‌లల్లా అని పిలిచేవారని తులసీ దాస్ తను రచించిన రామచరిత మానస్‌లో ప్రస్తావించాడు. అయోధ్యలో కొలువుదీరుతున్నది బాలరాముడైనందున రామ్‌లల్లాగా పిలుస్తున్నారు.