దేశంలో చాలా ప్రాంతాల్లో ఎకనమిక్ యాక్టివిటీలు ప్రారంభమయ్యాయని, రాబోయే రోజుల్లో ఇవి పుంజుకుంటాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఎకానమీ త్వరలోనే పట్టాలెక్కుతుందని అన్నారు. లాక్డౌన్, కరోనా కట్టడి, ఆర్థిక కార్యకలాపాలపై రాష్ట్రాలు ఇచ్చే సూచనల ఆధారంగానే ముందుకెళ్తామన్నారు. ఎకానమీని రివైవ్ చేసేందుకు, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సరైన వ్యూహం రూపొందించాలని చెప్పారు. ఈనెల 17 తర్వాత కూడా లాక్డౌన్ కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. సుమారు 6 గంటలపాటు వీడియో కాన్ఫరెన్స్లో సీఎంలతో డిస్కస్ చేశారు.
న్యూఢిల్లీ: దేశంలో లాక్డౌన్ను కొనసాగించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ నెల 17 తర్వాత కూడా లాక్డౌన్ ఉంటుందని చెప్పారు. ఎకానమీ పట్టాలెక్కుతుందని అన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదిగానే ప్రారంభమయ్యాయని, రాబోయే రోజుల్లో ఇవి పుంజుకుంటాయని కామెంట్ చేశారు. లాక్డౌన్, కరోనా కట్టడి, ఎకనమిక్ యాక్టివిటీలపై రాష్ర్టాలు ఇచ్చే సూచనల ఆధారంగానే దేశ భవిష్యత్ మార్గం ఉంటుందని అన్నారు. ఈ నెల 15లోగా సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎంలను కోరారు. ఎకానమీని రివైవ్ చేసేందుకు, కరోనాను ఎదుర్కొనేందుకు మనం ‘బ్యాలెన్స్డ్ స్ర్టాటజీ’ని రూపొందించి అమలు చేయాలని పిలుపునిచ్చారు. రూరల్ ఇండియాను కరోనా ఫ్రీగా ఉండేలా జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు. ఇంటికి వెళ్లాలని కోరుకుకోవడం మనిషి సహజ లక్షణమని, ఇలా వెళ్తున్న వలస కూలీల వల్ల గ్రామాలకు వైరస్ సోకకుండా చూసుకోవడమే మన ముందు ఉన్న అతిపెద్ద సవాలని అన్నారు. త్వరలో థర్డ్ ఫేజ్ లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడారు. సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కరోనాను కంట్రోల్ చేయడం, ఎకనమిక్ యాక్టివిటీలను దశలవారీగా ప్రారంభించడం వంటి వాటిపై చర్చించారు. సీఎంల అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత ఈ నెల 17 నిర్ణయం తీసుకుంటామని ప్రధాని చెప్పారు.
వైరస్.. గ్రామాలకు స్ప్రెడ్ కావద్దు
‘‘కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడివారు అక్కడే ఉండాలని మనం కోరాం. కానీ.. ఇంటికి వెళ్లాలని కోరుకోవడం మనిషి సహజ లక్షణం. అందుకే మన నిర్ణయాలను మార్చుకున్నాం. గ్రామాలకు వైరస్ సోకకుండా చూసుకోవడమే మన ముందు ఉన్న అతిపెద్ద సవాలు. వలస కూలీల తరలింపు ప్రక్రియలో రాష్ట్రాలు సమన్వయం చేసుకుంటూ సహకరించుకోవాలి. ఎక్కడైనా సరే ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలి’’ అని మోడీ అన్నారు. ‘‘కరోనాపై పోరులో మనం సక్సెస్ అయ్యామని ప్రపంచం అంటోంది. ఈ యుద్ధంలో రాష్ట్రాలదే కీ రోల్. కరోనాను దీటుగా ఎదుర్కొన్నాయి” అని పొగిడారు. కానీ సోషల్ డిస్టెన్సింగ్ నియమాల అమలులో సమస్యలు ఎదురవుతున్నాయని, లాక్డౌన్ గైడ్లైన్స్ అమలు విషయంలోనూ సరిగ్గా వ్యవహరించడం లేదని చెప్పారు.
లాక్డౌన్ పొడిగించాలి..
వీడియో కాన్ఫరెన్స్లో కొందరు సీఎంలు ఎకనమిక్ యాక్టివిటీలను ప్రారంభించాలని కోరగా.. ఇంకొందరు వ్యతిరేకించారు. ట్రైన్ సర్వీసులు ప్రారంభించడం ప్రమాదకరమన్నా రు. లాక్డౌన్ను పొడిగించాలని మహారాష్ర్ట, వెస్ట్ బెంగాల్, పంజాబ్, అస్సాం, బీహార్ సీఎంలు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ తప్ప మరో మార్గం లేదన్నారు. ఓవైపు లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలని చెబుతూనే.. మరోవైపు ట్రైన్ సర్వీసులు నడపాలని మమత కోరారు. రైలు, విమాన రాకపోకలకు ఇప్పట్లో అనుమతి ఇవ్వొద్దని, రాకపోకలు మొదలైతే వైరస్ వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం ఉందని తమిళనాడు సీఎం పళనిస్వామి, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానికి స్పష్టం చేశారు. లాక్డౌన్ను కంటెయిన్ మెంట్ జోన్లకే పరిమితం చేయాలని, ఆర్థిక కార్యకలాపాలు సాగకుంటే కష్టమని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ చెప్పారు. సమావేశం దాదాపు 6 గంటల పాటు జరిగింది. కరోనా వ్యాప్తి మొదలయ్యాక ప్రధాని, సీఎంల మధ్య జరిగిన ఐదో మీటింగ్ ఇది. ఈసారి అందరు సీఎంలు మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్
పాల్గొన్నారు.
ఏ సీఎం ఏం చెప్పారంటే…
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీలో కంటెయిన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో ఎకనమిక్ యాక్టివిటీలు ప్రారంభించాలి.
ఏపీ సీఎం జగన్
అగ్రికల్చర్ మార్కెట్లు ఓపెన్ చేయాలి. లోన్టర్మ్స్ను సరళీకృతం చేయాలి. అన్ని వైరస్ ప్రోటోకాల్స్ పాటిస్తూనే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్తో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, షాపింగ్ మాల్స్ను అనుమతించాలి.
అస్సాం సీఎం సోనోవాల్
మరో రెండు వారాలు లాక్డౌన్ కొనసాగించాలి. లేదంటే వైరస్ వ్యాప్తి పెరుగుతుంది. ఇంటర్స్టేట్ మూమెంట్పై జాగ్రత్తగా ఉండాలి. అస్సాంకు వచ్చే రైళ్ల మధ్య కనీసం
ఒకవారం గ్యాప్ ఉండాలి.
పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్
లాక్డౌన్ ను పొడిగించాలి. రాష్ట్రాలకు ఎకనమిక్ ఎంపవర్మెంట్ ఇవ్వాలి. జోన్లను నిర్ణయించే అధికారం మాకే వదిలేయాలి. రైతులకు మద్దతు ధర ప్రకటించాలి. రెడ్ జోన్లలో ఎంఎస్ఎంఈలకు అనుమతివ్వాలి. జీఎస్టీ బకాయిలు ఇవ్వాలి.
గోవా సీఎం ప్రమోద్ సావంత్
ఆంక్షలు ఎత్తేయాలి. ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్ట్కు అనుమతి ఇవ్వాలి. మైనింగ్, టూరిజంకు పర్మిషన్ ఇవ్వాలి.
బీహార్ సీఎం నితీశ్ కుమార్
ఇంకొన్ని రోజులు మేం లాక్డౌన్ పొడిగిస్తం. ఒకసారి లాక్డౌన్ ఎత్తేస్తే జనం బయటి నుంచి భారీగా వస్తారు. అప్పుడు కేసులు పెరిగిపోయే ప్రమాదం ఉంది.
అరుణాచల్ సీఎం పెమా ఖండు
ఇతర రాష్ర్టాల్లో ఉన్న కూలీలు భారీగా వస్తున్నారు. క్విక్ టెస్టుల కోసం ట్రునాట్ మెషిన్లు ఇవ్వండి.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే
వుహాన్లో సెకెండ్ వేవ్ కేసులు నమోదవుతున్నాయని చదివాను. డబ్ల్యూహెచ్వో కూడా దీని గురించి వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి.. లాక్డౌన్ విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. లాక్డౌన్ పొడిగించాలి. ఎసెన్షియల్ సర్వీసుల్లో ఉన్న వారి కోసం ముంబై లోకల్ ట్రైన్లు ప్రారంభించాలి.
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్
రాష్ర్టాలు డీ సెంట్రలైజ్డ్ వేలో అమలు చేసేందుకు వీలుగా లాక్డౌన్ సూత్రాలు ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించిన తర్వాతే రైళ్లను అనుమతించాలి.