
- సైబర్ నేరగాళ్ల వరుస ఫోన్లతో బెంబేలెత్తుతున్న ప్రజలు
నందిపేట, వెలుగు : ‘నేను సీబీఐ ఆఫీసర్ను మాట్లాడుతున్న... మీ అమ్మాయి ఓ కేసులో ఇరుక్కొని ఇప్పుడు మా ఆధీనంలో ఉంది.. వెంటనే రూ. 50 వేలు పంపితే విడిచిపెడుతాం.. లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తది’ అంటూ సైబర్ నేరగాళ్లు బెదిరింపు కాల్స్ చేస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఓ యువతికి ఐదు రోజుల కింద వాట్సప్ కాల్ చేసి బెదిరించారు. తాజాగా నందిపేట మండలం జోజీపేటకు చెందిన ఇద్దరికి ఫోన్ చేసి ‘మీ పిల్లలు మా వద్ద ఉన్నారు.. వెంటనే డబ్బు పంపండి’ అంటూ కాల్ కట్ చేశారు. వారు వెంటనే తమ పిల్లలకు ఫోన్ చేసి వారు క్షేమంగానే ఉన్నట్లు తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శుక్రవారం సైతం ఆంధ్రానగర్ గ్రామానికి చెందిన రేషన్ డీలర్ శరత్బాబుకు +92 3260739277 అనే నంబర్ నుంచి వాట్సప్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను సీబీఐ ఆఫీసర్ను అని చెబుతూ శరత్బాబు కుటుంబ సభ్యుల పేర్లన్నీ చెప్పాడు. తర్వాత ‘మీ పాప ఓ కేసుల్లో ఇరుక్కొని మా వద్ద ఉంది, వెంటనే రూ. 50 వేలు పంపు’ అని అనగానే అనుమానం వచ్చిన శరత్బాబు ఫోన్ చేసి వెంటనే హైదరాబాద్ హాస్టల్లో ఉన్న అమ్మాయి ఫోన్ చేశాడు. ఆమె హాస్టల్లోనే ఉన్నట్లు తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నాడు. ఐదు రోజుల కింద రాంపూర్ యువతికి వచ్చిన కాల్ డీపీనే ఈ నంబర్కు ఉండడం గమనార్హం. సైబర్ నేరగాళ్లు కుటుంబ సభ్యుల వివరాలన్నీ చెబుతూ వరుసగా ఫోన్ చేసి బెదిరిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు స్పందించి ప్రత్యేక నిఘా పెట్టాలని కోరుతున్నారు.