కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటూ కార్యకర్తలతో పాటు రోజూ దాదాపు 20 నుండి 25 కిలో మీటర్లు నడుస్తున్నారు. అయినప్పటికీ ముఖంలో ఆ చిరునవ్వును చెరగనివ్వకుండా పాదయాత్ర సాగిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడక్కడా సేదతీరుతూ, పార్టీ లీడర్లతో మమేకమవుతూ, కార్యకర్తలకు సమాధానాలిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎండలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీకి ఓ కార్యకర్త ఆసక్తికరమైన ప్రశ్న వేశాడు. ఇంత ఎండలో నడుస్తున్నా టాన్ రాకుండా ఏం వాడుతున్నారని అడిగిన ప్రశ్నకు, రాహుల్ గాంధీ ఎలాంటి తడబాటు లేకుండా సమాధానమిచ్చారు.
ఇటీవలే రాహుల్ పాదయాత్ర కర్ణాటకలోని బళ్లారి ప్రాంతంలోకి ప్రవేశించింది. అక్కడ ఆయన విశ్రాంతి తీసుకున్న ప్రాంతంలో కొందరు అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని స్క్రీన్ కేర్ గురించి అడిగిన ప్రశ్న అందర్నీ ఆశ్చర్యపరిచింది. పాదయాత్రలో పాల్గొన్నా.. టానింగ్ రాకుండా ఏం స్తున్నారు..? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా తాను సన్స్క్రీన్ లోషన్ వాడనని రాహుల్ చెప్పారు. సన్స్క్రీన్ లోషన్ వాడకపోయినా మీ ముఖం మెరిసిపోతోందని మళ్లీ ఆ అభిమాని అడగగా.. దానికి రాహుల్ నవ్వుతూ అమ్మ తనకు సన్స్క్రీన్ డబ్బా పంపింది. కానీ, తాను వాడనంటూ.. తన చేతికి ఉన్న టాన్ను అభిమానికి చూపించారు. దీంతో అక్కడున్న వారంతా సరదాగా నవ్వేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సైతం భారత్ జోడో యాత్ర ట్విటర్ ఖాతాలో యూట్యూబ్ వీడియోను షేర్ చేసింది.