- రోజుల తరబడి కేంద్రాల వద్దే రైతుల పడిగాపులు
- రైస్మిల్లులో అన్లోడింగ్లోనూ జాప్యమే
- ఉమ్మడి మెదక్ జిల్లాలో అవస్థలు పడుతున్న రైతులు
మెదక్, సిద్దిపేట, వెలుగు: కొనుగోలు సెంటర్లకు భారీగా వడ్లు వస్తుండగా కాంటాల్లో ఆలస్యం జరుగుతోంది. కాంటాలు పూర్తయినా లారీలు రావడం లేదు. దీంతో కొనుగోలు సెంటర్లలోనే రైతులు వడ్ల బస్తాలకు కాపలా కాస్తూ పడిగాపులు పడుతున్నారు. మరోవైపు అకాల వర్షాలు కలవరపెడుతుండగా రైతులు ఆందోళన చెందుతున్నారు.
కొన్నిచోట్ల కాంటాలు లేటు..
మరికొన్ని చోట్ల లారీలు రాక
ఉమ్మడి జిల్లాలో అన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, వడ్లను ఎప్పటికప్పుడు కొని, వెంటవెంటనే రైస్ మిల్లులకు తరలిస్తున్నట్టు అధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. చాలా చోట్ల వడ్ల కాంటా ఆలస్యం అవుతుండగా, మరికొన్ని చోట్ల తూకం వేసి రోజులు గడుస్తున్నా లారీలు రాక వందలాది బస్తాలు కేంద్రాల వద్దే ఉంటున్నాయి.
మెదక్ జిల్లా వ్యాప్తంగా దొడ్డురకం, సన్నరకం ధాన్యం కొనుగోలు చేసేందుకు మొత్తం 533 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిద్వారా కొన్న వడ్లను తరలించేందుకు అనుగుణంగా లారీలు సమకూర్చకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం 300 పైచిలుకు లారీలు మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల కేంద్రాల్లో కాంటా పెట్టిన ధాన్యం తరలించడానికి ఇబ్బంది కలుగుతోంది. దీంతోపాటు మిల్లుల్లో అన్లోడింగ్ ఆలస్యం అవుతుండటంతో సమస్య మరింత జఠిలమవుతోంది. ఒక్క మెదక్ మండలం పాతూర్ లోనే పీఏసీఎస్ కొనుగోలు సెంటర్లో కాంటా పెట్టినప్పటికి నాలుగైదు రోజులుగా లారీలు రాక సుమారు 1,700 పైచిలుకు బస్తాలు అక్కడే ఉండిపోయాయి. వీటిని తరలించేందుకు, మిల్లుల్లో అన్లోడింగ్కు సుమారు వారం పడుతోందని సెంటర్ఇన్చార్జి రాజు తెలిపారు. చిలప్చెడ్ మండలం చండూర్, చిట్కుల్, గంగారం, సామ్ల తండాలో లారీలు రాక ధాన్యం బస్తాలు రైస్ మిల్లులకు తరలించలేదు. సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఫైజాబాద్, చిలప్ చెడ్, బండ పోతుగల్లో, కొల్చారం మండలంలోని పలు గ్రామాల్లో సైతం ఇదే పరిస్థితి ఉంది.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లు ఆశించిన మేర వేగంగా జరగడం లేదు. దాదాపు నెల రోజులుగా ధాన్యం పెద్ద ఎత్తున మార్కెట్లోకి వస్తున్నా కొనుగోళ్లలో జాప్యం ఏర్పడుతోంది. జిల్లాలో మొత్తం 427 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో సుమారు 350 కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారు 30 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేశారు. భారీ ఎత్తున ధాన్యం మార్కెట్కు వస్తున్నా ఆయా కొనుగోలు కేంద్రాల్లో స్థలం లేక ఆరు బయటనే కుప్పలు పోస్తున్నారు. కొనుగోలు కోసం వచ్చిన ధాన్యాన్ని మిల్లర్ల ఒత్తిడి కారణంగా బీ గ్రేడ్ రకంగా కొనుగోలుచేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు చాలా మార్కెట్ యార్డుల్లో మక్కలు, సన్ ఫ్లవర్ పేరుక పోవడంతో వరి ధాన్యం పోసుకోవడానికి స్థలం ఉండడం లేదు. గన్నీ బ్యాగుల కొరత, రవాణా సమస్యతోపాటు మిల్లర్ల కొర్రీలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు అకాల వర్షం వల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలో హమాలీల కొరత
సంగారెడ్డి జిల్లాలో హమాలీల కొరత ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 210 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 166 కేంద్రాలు ఓపెన్ అయ్యాయి. హమాలీలు సరిపడా లేకపోవడంతో ధాన్యం కాంటా పెట్టడంలో జాప్యం జరుగుతోంది. దీంతో కొనుగోలు సెంటర్లలో భారీగా వడ్ల నిల్వలు
పేరుకుపోతున్నాయి.
