ఇంగ్లండ్ను పడగొట్టేదెవరు..? 20 వికెట్లు తీసే బౌలర్ ఎవరు..? కుల్దీప్, నితీశ్, సుందర్ మధ్య గట్టి పోటీ!

ఇంగ్లండ్ను పడగొట్టేదెవరు..? 20 వికెట్లు తీసే బౌలర్ ఎవరు..? కుల్దీప్, నితీశ్, సుందర్ మధ్య గట్టి పోటీ!
  • రెండో టెస్ట్‌‌ కోసం ఐదుగురు నాణ్యమైన బౌలర్లు
  • టెయిలెండర్ల బ్యాటింగ్‌‌పైనా కసరత్తు

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌‌తో తొలి టెస్ట్‌‌ ఓటమితో విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా.. ఇప్పుడు రెండో మ్యాచ్‌‌పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా నాణ్యమైన ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. అయితే తొలి టెస్ట్‌‌లో విఫలమైన శార్దూల్ ఠాకూర్‌‌, ప్రసిధ్‌‌ కృష్ణలో ఎవర్ని తప్పించాలి? అతని ప్లేస్‌‌లో ఎవర్ని తీసుకోవాలి? అనే దానిపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. 

బ్యాటింగ్‌‌ను కాసేపు పక్కనబెడితే ప్రతి మ్యాచ్‌‌లో 20 వికెట్లు తీయడమే తమ ప్రధాన కర్తవ్యమని చీఫ్‌‌ కోచ్‌‌ గౌతమ్‌‌ గంభీర్‌‌ స్పష్టంగా చెప్పేశాడు. కెప్టెన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ కూడా దీనికి అంగీకరించాడు. నలుగురు టెయిలెండర్లతో ఆడటానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించాడు. రెండో టెస్ట్‌‌కు వేదికైన బర్మింగ్‌‌హామ్‌‌ స్పిన్నర్లకు అనుకూలమని సంకేతాలు వస్తున్న నేపథ్యంలో రిస్ట్‌‌ స్పిన్నర్‌‌ కుల్దీప్‌‌ యాదవ్‌‌ను ఆడిస్తారా? లేక సీమర్లను కంటిన్యూ చేస్తారా? అన్న డైలమా కొనసాగుతోంది.
 
 

బ్యాటింగ్‌‌ కోసమే శార్దూల్‌‌..

తొలి టెస్ట్‌‌లో శార్దూల్‌‌ను తీసుకోవడం సరైన ఎంపిక అని భావించినా ఫలితం తర్వాత తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ ఎనిమిదో నంబర్‌‌లో శార్దూల్‌‌ బ్యాటర్‌‌గా ఉపయోగపడతాడని టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ భావించింది. ఈ క్రమంలో అతను బౌలింగ్‌‌లోనూ తేలిపోయాడు. ఈ రెండు ప్లాన్స్‌‌ అట్టర్‌‌ ప్లాప్‌‌ కావడంతో ఇప్పుడు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఆస్ట్రేలియా పిచ్‌‌లపై నితీశ్‌‌ రెడ్డి అద్భుతంగా బౌలింగ్‌‌ చేశాడు. కానీ ఇంగ్లండ్‌‌ వాతావరణ పరిస్థితులు వెచ్చగా ఉండటం, ఫ్లాట్‌‌ పిచ్‌‌లపై బౌలింగ్‌‌ ఇబ్బందిగా మారడంతో నితీశ్‌‌ ప్లేస్‌‌లో శార్దూల్‌‌ను ఆడించారు. 

అయితే శార్దూల్‌‌ బౌలింగ్‌‌ చేసిన 16 ఓవర్లలో రన్స్‌‌ను కంట్రోలు చేయలేకపోయాడు. సిడ్నీ టెస్ట్‌‌లో ముగ్గురు పేసర్లతో పాటు జడేజా, సుందర్‌‌తో బరిలోకి దిగారు. దీనికి విరుద్ధంగా హెడింగ్లీలో బ్యాటింగ్‌‌ ఆల్‌‌రౌండర్‌‌గా శార్దూల్‌‌ను దించడం బెడిసికొట్టింది. 20 వికెట్లు తీసే అవకాశం చేజారింది. ఫలితంగా ఇండియా భారీ స్కోర్లు చేసినా ఓటమిపాలైంది. ఇప్పుడు దాని నుంచి గుణపాఠం నేర్చుకుని రెండో టెస్ట్‌‌కు సిద్ధమైంది. 

లోయర్‌‌ ఆర్డర్‌‌తోనే సమస్య.. 

టీమిండియా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య లోయర్‌‌ ఆర్డర్‌‌ బ్యాటింగ్‌‌. దీన్ని బలోపేతం చేసే క్రమంలో నాణ్యమైన బౌలర్లను పక్కనబెట్టాల్సి వస్తోంది. టెస్ట్‌‌లు గెలవాలంటే టీమ్‌‌లో కచ్చితంగా ఐదుగురు నాణ్యమైన బౌలర్లు ఉండాలి. ఇందులో ఒక ఆల్‌‌రౌండర్‌‌ ఉంటే సరిపోతుంది. కానీ తొలి టెస్ట్‌‌లో జడేజాతో పాటు శార్దూల్‌‌ను ఆల్‌‌రౌండర్‌‌గా ఆడించి ఓ బౌలింగ్‌‌ ఆప్షన్‌‌ను తక్కువ చేసుకుంది. ఎక్కువ రన్స్‌‌ చేయడానికి బదులుగా ప్రత్యర్థిని వీలైనంత త్వరగా ఔట్‌‌ చేసే ప్రణాళికలు సిద్ధం చేయాలి. దీనివల్ల బ్యాటర్లపై భారం తగ్గడంతో పాటు మ్యాచ్‌‌ గెలిచే అవకాశాలు రెట్టింపవుతాయి. ఇక కొత్త డ్యూక్‌‌ బాల్‌‌ గతంలో కంటే ఎక్కువగా స్వింగ్‌‌ అవుతోంది. దీన్ని సరిగ్గా ఉపయోగించే ఐదుగురు బౌలర్లు జట్టులో ఉండేలా చూసుకోవాలి. అప్పుడు టెస్ట్‌‌ మ్యాచ్‌‌ నెగ్గడానికి 471, 364 రన్స్‌‌ అయినా సరిపోతాయి.

కుల్దీప్‌‌ బెటర్‌‌ ఆప్షన్‌‌

శార్దూల్‌‌ ప్లేస్‌‌లో మరో పేసరా, స్పిన్నరా అనేది పిచ్‌‌ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కానీ అసాధారణంగా పొడిగా ఉండే ఇంగ్లిష్‌‌ వేసవిలో బజ్‌‌బాల్‌‌ స్ట్రాటజీని ఎదుర్కోవాలంటే కుల్దీప్‌‌లాంటి నాణ్యమైన స్పిన్నర్‌‌ చాలా అవసరం. ఫ్లాట్‌‌ పిచ్‌‌లపై అతను బాల్‌‌ను బాగా టర్న్‌‌ చేస్తాడు. ఫింగర్‌‌ స్పిన్నర్ల కంటే రిస్ట్‌‌ స్పిన్నర్‌‌ బాల్‌‌ నుంచి సహజ వైవిధ్యాన్ని రాబడతాడు. అవసరమైన చోట బంతిని రెండు వైపులా తిప్పగలడు. లీడ్స్‌‌లో జడేజా బౌలింగ్‌‌లో ఇంగ్లండ్‌‌ 39సార్లు రివర్స్‌‌ స్వీప్‌‌ ఆడింది. గతంలో ఏ బౌలర్‌‌పై ఇన్నిసార్లు ఆడలేదు. కానీ అదే రిస్ట్‌‌ స్పిన్నర్‌‌ బౌలింగ్‌‌లో అంత సులభంగా ఆడలేరు. 2024లో ఇండియాలో పర్యటించిన ఇంగ్లండ్‌‌ జట్టుపై కుల్దీప్‌‌ తీవ్రమైన ప్రభావం చూపించాడు. 

నాలుగు టెస్ట్‌‌ల్లో 19 వికెట్లు తీశాడు. ధర్మశాలలో జరిగిన చివరి టెస్ట్‌‌లో ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ ప్రదర్శన కూడా చేశాడు. కాబట్టి అతన్ని తీసుకుంటే ఇంగ్లండ్‌‌ బ్యాటింగ్‌‌కు కాస్త భయం కలిగించొచ్చు. నలుగురు సీమర్లను ఆడించే ప్లేస్‌‌లో నాణ్యమైన ఇద్దర్ని తీసుకొని ఇద్దరు స్పిన్‌‌ ఆల్‌‌రౌండర్లతో వెళ్లొచ్చు. ఇక బ్యాటింగ్‌‌లో 8, 9 ప్లేస్‌‌ల్లో పెద్దగా రన్స్‌‌ రావనే విషయం అందరికీ తెలుసు. కానీ ఇదే ప్లేస్‌‌లో ఇద్దరు నాణ్యమైన బౌలర్లు ఉంటే 20 వికెట్లు తీసే సామర్థ్యం పెరుగుతుందనేది మాత్రం నిజం. టాప్‌‌–7లో మొండిగా ఆడే బ్యాటర్‌‌గా కూడా కుల్దీప్‌‌ పనికొస్తాడు. 

నెట్స్‌‌, బ్రేక్‌‌ సెషన్‌‌లో బ్యాటింగ్‌‌ ప్రాక్టీస్‌‌ కూడా చేస్తున్నాడు. 20 ఏండ్ల కిందట ఫ్లింటాఫ్‌‌ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌‌గా నిలిస్తే, 40 వికెట్లు తీసిన షేన్‌‌ వార్న్‌‌ ఇప్పటికీ రారాజు. ఆ తర్వాత అనిల్‌‌ కుంబ్లే ఇంగ్లండ్‌‌పై ప్రభావాన్ని చూపెట్టాడు. కాబట్టి అత్యుత్తమ రిస్ట్‌‌ స్పిన్నర్‌‌ అయిన కుల్దీప్‌‌ను ఆడించే సమయం ఆసన్నమైంది.