Team India: షమీ, సిరాజ్‌లను ఎందుకు తీసుకోవట్లేదు.. బీసీసీఐ, సెలెక్టర్లపై ఎంఐఎం నేత సంచలన వ్యాఖ్యలు 

Team India: షమీ, సిరాజ్‌లను ఎందుకు తీసుకోవట్లేదు.. బీసీసీఐ, సెలెక్టర్లపై ఎంఐఎం నేత సంచలన వ్యాఖ్యలు 

Team India: T20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు సెలక్షన్ పై తీవ్ర వివాదం చోటు చేసుకుంది. వరల్డ్ కప్ లో ఇటీవల టీమ్ చూపిస్తున్న ప్రదర్శనపై మహారాష్ట్రలో రాజకీయ వివాదం చెలరేగింది. టీమ్ ఎంపికలో మత వివక్ష కొనసాగుతుందని కొంతమంది రాజకీయ నేతలు ఆరోపణలు చేయగా, మరికొందరు వాటిని తీవ్రంగా ఖండించారు. టీమిండియా సూపర్‌–8 దశలో కీలక మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో ఇలాంటి వివాదస్పద అంశం వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతుంది.  

జట్టు ఎంపికలో మత వివక్ష:  
మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోకపోవడం అన్యాయమని AIMIM ఎమ్మెల్యే ముఫ్తీ ఇస్మాయిల్ వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోవడానికి ఇదే కారణమా? అని ప్రశ్నించారు. కావాలనే ముస్లిం ఆటగాళ్లను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీ నేత అబూ ఆజ్మీ కూడా ఈ అంశంపై స్పందించారు. మతం ఆధారంగా ప్లేయర్స్ ని పక్కన పెట్టడం దారుణమైంది.. షమీ, సిరాజ్‌లకు కేవలం మతం వల్లే అవకాశాలు దక్కడం లేదనే విషయం క్లియర్ గా కనిపిస్తుందన్నారు. 

ఖండించిన కాంగ్రెస్, NCP:  
మతం ఆధారంగా జట్టు ఎంపిక ఉంటుందని ఎంఐఎం నేత చేసిన ఆరోపణలను NCP నేత ఇడ్రిస్ నాయకవాడి, కాంగ్రెస్ నేత అమిన్ పటేల్ తీవ్రంగా ఖండించారు. భారత జట్టులో గతంలో అనేక మంది ముస్లిం ప్లేయర్స్ ఆడారు, కెప్టెన్లుగా కూడా పని చేశారని గుర్తు చేశారు. జట్టు ఎంపిక అనేది పూర్తిగా తమ వ్యక్తిగత ప్రదర్శనపై ఆధార పడి ఉంటుందన్నారు. మతానికి ఇందులో ఎలాంటి పాత్ర లేదని వెల్లడించారు. దీనిపై మహారాష్ట్ర మంత్రి భరత్ గోగావలే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జట్టు ఎంపిక పూర్తిగా ఆటగాళ్ల ఫర్ఫామెన్స్ ఆధారంగానే జరుగుతుందని చెప్పారు. క్రీడల్లోకి మత రాజకీయాలను కలపవద్దని సూచించారు. లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత్, సూపర్‌–8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 76 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. ఇప్పుడు జింబాబ్వేతో జరగబోయే ‘డూ ఆర్ డై’ మ్యాచ్ లో విజయం సాధించి సెమీస్ ఛాన్సులని మెరుగుపర్చుకోవాలని చూస్తుంది.