హైదరాబాద్, వెలుగు: లక్డీకాపూల్ ఏసీ గార్డ్స్లోని వారసత్వ కట్టడం ఖుస్రో మంజిల్ కూల్చివేతకు కారణాలను వివరించాలని రాష్ట్ర సర్కార్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్తో పాటు హెచ్ఎండీఏను చీఫ్ జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావిలితో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఖుస్రో మంజిల్ను పరిరక్షించాలని కోరుతూ అదే ప్రాంతానికి చెందిన బాలరామచంద్రం, మరో నలుగురు దాఖలు చేసిన పిల్ను డివిజన్ బెంచ్ ఇటీవల విచారించింది. నోటీసులు జారీ చేసిన కోర్టు.. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ భవనాన్ని 1920లో నిజాం హయాంలో కట్టారు. ఏడో నిజాం సైన్యంలోని చీఫ్ కమాండింగ్ ఆఫీసర్ ఖుస్రో జంగ్ బహదుర్కు అధికారిక భవనంగా ఉండేది. అందుకే ఖుస్రో మంజిల్గా పేరొచ్చింది. ప్రభుత్వం1996లో దీన్ని వారసత్వ భవనంగా గుర్తించింది. ఈ భవనంలోని కొంత భాగాన్ని కూల్చివేయడాన్ని పిటిషనర్లు హైకోర్టులో సవాల్ చేశారు.