
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ను మే 3 వరకూ పొడిగిస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. కానీ మే 3 వరకూ పెంచాలన్న దాని వెనక లాజిక్ ఏమిటి? ఇప్పుడు ఎక్కువ మందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. చాలా రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకూ లాక్డౌన్ పొడిగించాలని నిర్ణయించాయి. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు మొదలైన రాష్ట్రాలు ఈ లిస్ట్లో ఉన్నాయి. పంజాబ్ మే 1 వరకూ లాక్డౌన్ పొడిగించింది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా ఏప్రిల్ 30 వరకూ లేదా మే 1 వరకూ లాక్డౌన్ను పొడిగిస్తుందని అంతా భావించారు. కార్మికుల దినోత్సవం కావడం వల్ల మే 1 హాలీడే అని, ఇక మే 2, 3 శని, ఆదివారం వచ్చాయని, అందువల్లే మే 3 వరకూ లాక్డౌన్ను పొడిగించాలని కేంద్రం నిర్ణయించిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 30న లాక్డౌన్ను ఎత్తేస్తే సెలవులు కావడం వల్ల పెద్ద సంఖ్యలో జనం సొంతూళ్లకు వెళ్లే ప్రయత్నం చేస్తారని, దీని వల్ల కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుందని తెలిపాయి.