భర్తను కొట్టి చంపిన భార్య

భర్తను కొట్టి చంపిన భార్య

నల్లబెల్లి, వెలుగు: వరంగల్​జిల్లాలో రోజూ తాగొచ్చి వేధిస్తున్న భర్తను కొట్టి చంపిందో భార్య. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుగ్గొండి మండలం మైసంపల్లి ఎస్సీ కాలనీకి చెందిన జేరిపోతుల రాజు(45), రజిత భార్యాభర్తలు వీరికి కొడుకు సూర్యం, కూతురు మాధవి ఉన్నారు. రజిత కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తుండగా, రాజు జల్సా చేస్తూ మద్యానికి బానిసయ్యాడు. రోజూ రాత్రిపూట తాగొచ్చి భార్యతో గొడవ పడుతున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి మరోసారి మద్యం తాగొచ్చి ఇంట్లో గొడవకు దిగాడు.

కొడుకు, కూతురు సర్ది చెప్పినా వినిపించుకోలేదు. పైగా వారిని కూడా బూతులు తిట్టాడు. విసిగిపోయిన రజిత పక్కనే ఉన్న ఇటుకతో రాజు తలపై కొట్టింది. తీవ్ర గాయంతో కుప్పకూలిన రాజు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం రజిత పిల్లలతో కలిసి పోలీస్​స్టేషన్​లో లొంగిపోయింది. శనివారం ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, డెడ్​బాడీని మార్చురీకి తరలించారు. నిందితురాలు రజితపై కేసు నమోదు చేశారు.