న్యూఢిల్లీ: తన పిల్లల ఆన్ లైన్ క్లాసుల కోసం కొత్త మొబైల్ ఫోన్ కొనుగోలు చేయకపోవడంతో ఓ మహిళ తన భర్తతో గొడవపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని మైదాన్ గర్హి ప్రాంతంలో గురువారం జరిగింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు పోలీసులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ సుల్తాన్ పూర్ కు చెందిన జ్యోతి మిశ్రా(29), ప్రమోద్మిశ్రాలకు ఏడేళ్ల కిందట పెళ్లయింది. ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉంటున్న ఈ జంటకు ఇద్దరు సంతానం. ప్రమోద్ ఇటీవల తన పెద్ద కొడుకు(6) ఆన్లైన్ క్లాసుల కోసం ఒక స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేశాడు, కూతురు(4) ఆన్లైన్ తరగతులకు కోసం మరో స్మార్ట్ ఫోన్ కొనాలని భార్య జ్యోతి భర్తను అడిగింది. అందుకు భర్త ప్రమోద్ నిరాకరించి లాక్డౌన్ ముగిసిన తర్వాత కొంటానని చెప్పడంతో జ్యోతి మనస్థాపానికి గురై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుందని పోలీసులు తెలిపారు. వెంటనే సఫ్దర్ జంగ్ ఆస్పత్రిగా తరలించగా 90 శాతం కాలిన గాయాలతో ట్రీట్మెంట్ పొందుతూ జ్యోతి చనిపోయిందని చెప్పారు. తల్లి చనిపోవడంతో పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు.
