
పచ్చని సంసారంలో వివాహేతర సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. గుట్టు రట్టు కావడంతో చివరకు ప్రాణాలు తీస్తున్నాయి. భార్యలు భార్యలను.. భర్తలు భార్యలను చంపుతోన్న ఘటనలు రోజురోజుకు కలవర పెడుతున్నాయి. ఇలా వరుస ఘటనలతో పెళ్లి మాట తలచుకుంటేనే వణుకు పుట్టేలా చేస్తున్నారు.
లేటెస్ట్ గా వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో మహిళ. ఈ దారుణ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. నిర్మల్ జిల్లా సోన్ మండలం వెల్మల్ గ్రామానికి చెందిన నాగలక్ష్మి .. అదే గ్రామానికి చెందిన మహేష్ ఇద్దరు కలిసి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ విషయం ఇటీవల భర్త హరిచరణ్ కు తెలియడంతో భర్తను టవల్ తో గొంతు నులిమి హతమార్చారు ఇద్దరు.
చనిపోయిన భర్త హరిచరణ్ ను బాత్రూంలో ఉంచి మూర్ఛ రోగంతో చనిపోయాడని బంధువులందరికి ఫోన్ చేసి చెప్పింది భార్య నాగలక్ష్మి. అయితే దుబాయ్ లో ఉన్న హరిచరణ్ కొడుకు కృష్ణ హుటాహుటిన గ్రామానికి వచ్చాడు . తల్లిపై అనుమానంతో కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి హత్యా నేరంగా విచారణ జరిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు.