ముంబై: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ ఎక్కువవుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు ఎక్కువ కేసులు మహారాష్ట్రలోనే ఉండటాన్ని బట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. కరోనా కేసుల తీవ్రత తగ్గకపోతే రాష్ట్రంలో లాక్డౌన్ విధించక తప్పదని స్పష్టం చేశారు. ప్రజలు సోషల్ డిస్టెన్సింగ్ నియమాలను పాటించాలని లేకుంటే లాక్డౌన్ విధిస్తామని హెచ్చరించారు.
‘వచ్చే వారం నుంచి కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ వేయాలని భావిస్తున్నాం. పాజిటివ్ల సంఖ్య మరింతగా పెరిగితే వేరే ప్రత్యామ్నాయం లేదు గనుక కఠినమైన లాక్డౌన్ను విధిస్తాం. ఏప్రిల్ 2 వరకు కరోనా కేసుల తీరును గమనిస్తాం. ప్రజలు సోషల్ డిస్టెన్సింగ్ నియమాలను పాటించడం లేదని ప్రభుత్వ దృష్టికి వస్తే వెంటనే లాక్డౌన్ విధిస్తాం’ అని అజిత్ పవార్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 31 వేలు దాటింది.