లక్నో: మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ చేసిన ప్రకటనను తాము నమ్మమని రైతు సంఘాలు ప్రకటించాయి. ఈ చట్టాలు రద్దయినట్లు ప్రభుత్వ గెజిట్ వస్తేనే నమ్ముతామని లక్నోలో నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్లో రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టం చేసింది. ‘ప్రధాని చేసిన ప్రకటనను మేం నమ్మం. ప్రభుత్వ గెజిట్ విడుదలయ్యాకే వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుందని నమ్ముతాం’ అని రైతు సంఘాల నేత జోగిందర్ సింగ్ అన్నారు.
యూపీలోని లఖీంపూర్ ఖేరీలో రైతులపై కారు దూసుకెళ్లిన ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, లక్నోలో నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్లో ఉత్తర్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్కు చెందిన దాదాపు వెయ్యి మంది రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్రం చేసిన ప్రకటనతోపాటు కనీస మద్దతు ధర లాంటి మిగతా డిమాండ్లపై కార్యక్రమంలో చర్చించారు. పార్లమెంట్లో సాగు చట్టాలను రద్దు చేసి, గెజిట్ విడుదల చేసే వరకు ఆందోళనలు కొనసాగించాలని రైతులు నిర్ణయించారు.