- ఆకలితో చచ్చిపోతామేమో అని ఆవేదన
- ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వడం లేదంటున్న కూలీలు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు విధించిన లాక్డౌన్ వలస కూలీలను తిప్పలు పెడుతోంది. పనులు లేక తినేందుకు తిండి లేక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లలో సీటు ఎప్పుడు దొరుకుతుందా.. ఇంటికి ఎప్పుడు పోతామా అని రైల్వే స్టేషన్ల దగ్గర, కరోనా స్క్రీనింగ్ సెంటర్ల దగ్గర పడిగాపులు కాస్తున్నరు. తిండి లేకుండా ఎండలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటికి వెళ్లేకంటే ముందే ఆకలితో.. ఎండ దెబ్బకు చచ్చిపోతామేమో అని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు, పెద్దలు, ముసలోళ్లు, గర్భిణిలు కూడా గంటల పాటు స్క్రీనింగ్ కోసం లైన్లో నిలబడుతున్నారని అన్నారు. “ ఆకలితో ఇక్కడ ఇలాగే చచ్చిపోతామేమో. నిన్న ఉదయం 11 గంటల నుంచి ఇక్కడే వేచి ఉన్నాను. కనీసం తినేందుకు తిండి కూడా ఇవ్వలేదు. పైగా పోలీసులు తిడుతున్నారు” అని బీహార్ ట్రైన్ కోసం వచ్చిన కరీష్మా దేవి అనే ఎనిమిది నెలల గర్భిణి ఆవేదన వ్యక్తం చేశారు. “ నిన్న పొద్దునంతా ఇక్కడే ఉన్నాను. ట్రైన్ లేదు. మీం వెళ్లాల్సిన రైలు పొద్దునే బయలుదేరుతుంది అని అర్ధరాత్రి దాటాక మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూసుకుని వచ్చే సరికి రైలు వెళ్లిపోయింది. కీనీసం తినేందుకు తిండి లేదు. డబ్బులు లేవు ఆకలితో, ఎండలో చచ్చిపోయేలా ఉన్నాం” అని బీహార్కు చెందిన అశోక్ కన్నీరు పెట్టుకున్నాడు. ప్రోటోకాల్ ప్రకారం శ్రామిక్ రైలులో వెళ్లేందుకు రిజిస్టర్ చేసుకున్న వారికి ఒక రోజు ముందు మెసేజ్ ఇవ్వాలి. వాళ్లంతా స్క్రీనింగ్ సెంటర్లకు వచ్చి పరీక్షలు చేయించుకున్న తర్వాత రైళ్లలోకి అనుమతిస్తారు. అయితే తమకు మెసేజ్లు రావడం లేదని, ఎప్పుడో అర్ధరాత్రి నిద్రపోతున్నప్పుడు మెసేజ్లు వస్తున్నాయని, దాని వల్ల టైమింగ్స్ తెలుసుకోలేగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.