
- జేడీయూ షేర్ తగ్గింది..బీజేపీకి పెరిగింది
- కూటమిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కమలం
న్యూఢిల్లీ: బీహార్ సీఎంగా మరోసారి పగ్గాలు చేపట్టాలని కలలు కంటున్న నితీశ్ కుమార్ భవితవ్యం బీజేపీ చేతిలో ఉంది. ఎన్డీయే కూటమిలో బీజేపీ మెజారిటీ సీట్లను గెలుచుకుంది. దీంతో బీజేపీ ముందు నుంచి చెబుతున్నట్టుగా నితీశ్నే సీఎం కేండిడేట్గా ఎన్నుకుంటుందా.. లేక బీజేపీ నాయకుడికి చాన్స్ ఇస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. నితీశ్కుమార్ ఇప్పటికే నాలుగుసార్లు సీఎంగా బిహార్కు సేవలందించారు. దాంతో జనరల్గానే ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. ఆయన పనితీరుపై కూడా విమర్శలు ఉన్నాయి. అయితే, నితీశ్ బ్రాండ్ ఇమేజ్ ఇప్పటికీ తగ్గలేదని, అయితే ఫలితాలపై ఆ ప్రభావం తప్పకుండా ఉంటుందని జేడీయూ నేతలే చెబుతున్నారు. ఈ ఎలక్షన్స్లో మోడీ ఇమేజ్ బాగా పనిచేసిందని బీజేపీ సీనియర్ లీడర్ కైలాశ్ విజయ్వర్గియా చెప్పారు. పార్టీలో చర్చించి ప్రభుత్వ ఏర్పాటు, దాని లీడర్ విషయాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కామెంట్స్ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వానికి నాయకత్వం వహించే కొత్త అభ్యర్థి కోసం బీజేపీ ఆలోచించే చాన్స్ ఉందని తెలుస్తోంది. కాగా, అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు నుంచీ కూడా నితీశ్ కుమార్ సీఎం కేండిడేట్ అని బీజేపీ చెబుతోంది. బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా నితీశ్నే సీఎం చేస్తామని ఆ పార్టీ సీనియర్లు పలుమార్లు చెప్పారు.
ప్రభుత్వాన్ని లీడ్ చేసేది నితీశ్ కుమారే..
ఎన్డీయే లీడర్ ఎవరనేదానిపై ఎలాంటి వివాదంలేదని బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ జైశ్వాల్ అన్నారు. ఈ విషయాన్ని ఎన్నికలకు ముందే పీఎం నరేంద్ర మోడీ, హోం మినిస్టర్ అమిత్ షా స్పష్టం చేశారన్నారు. మెజారిటీ సీట్లు సాధించి ఎన్డీయే గవర్నమెంట్ను ఏర్పాటు చేస్తే నితీశ్ దానిని లీడ్ చేస్తారని చెప్పారు. కాగా, కరోనా వ్యాప్తి, చిరాగ్ పాశ్వాన్ పార్టీ వల్లే ఫలితాల్లో నితీశ్ వెనకబడ్డారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వలస జీవులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయగా.. ఇంకొన్ని ఓట్లను చిరాగ్ చీల్చారని ఆరోపించారు.