తెలంగాణలో చలి మొదలైంది. మొన్నటివరకు పగలు, రాత్రి ఉక్కపోతతో అల్లాడిపోయిన జనం ఇప్పుడు చలితో గజగజ వణుకుతున్నారు . నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టడంతో తెలంగాణ వైపు శీతల గాలులు వీస్తున్నాయి. దీంతో చాలా జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు చేరుకున్నాయి. రాష్ట్రంలోని చాలా చోట్ల ఉదయం పొగమంచు కమ్మేస్తుంది. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.
హనుమకొండలో సాధారణం కన్నా 2.7 డిగ్రీలు తగ్గి, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.5 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్లో 1.8 డిగ్రీలు తగ్గి 17.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రామగుండం, మెదక్, హనుమకొండలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఖమ్మంలో మాత్రం సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా, గరిష్ఠ ఉష్ణోగ్రత 35.2 డిగ్రీలు నమోదైంది.
హైదరాబాద్, భద్రాచలం, ఆదిలాబాద్లోనూ సాధారణం కన్నా కొంచెం ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.