మేం చేసింది తప్పు అయితే.. మీరు చేసిందేంటి..? ట్రంప్ వ్యాఖ్యలకు ఇండియన్ ఆర్మీ కౌంటర్..!

మేం చేసింది తప్పు అయితే.. మీరు చేసిందేంటి..? ట్రంప్ వ్యాఖ్యలకు ఇండియన్ ఆర్మీ కౌంటర్..!

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‎తో మూడేళ్లుగా యుద్ధం చేస్తోన్న రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ.. ఓపెన్ మార్కెట్లో ఎక్కువ లాభాలకు అమ్ముకుంటుందంటూ భారత్‎పై తీవ్ర ఆరోపణలు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రష్యా తీరుతో ఎంతో మంది ప్రాణాలు పోతున్న పట్టింపే లేదని భారత్‎పై అక్కసు వెళ్లగక్కారు. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలకు ఇండియన్ ఆర్మీ కౌంటర్ ఇచ్చింది. 1971 పాక్-భారత్ యుద్ధ సమయంలో పాకిస్తాన్‌కు అమెరికా ఆయుధాల సరఫరా చేసిన విషయాన్ని గుర్తు చేసింది. 

ఉక్రెయిన్‎తో యుద్ధం చేస్తోన్న రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడం తప్పు అయితే.. మరీ 1971 ఇండియాపాక్ వార్ టైమ్‎లో పాకిస్థాన్‎కు అమెరికా ఆయుధాలు సరఫరా చేయడాన్ని ఏమంటారని పరోక్షంగా ట్రంప్‎కు కౌంటర్ ఇచ్చింది. మేం చేస్తే తప్పు.. అదే పని మీరు చేస్తే కరెక్టా అన్నట్లుగా ట్రంప్‎ దిమ్మతిరిగేపోయేలా నిలదీసింది. ఇందుకు సంబంధించిన పేపర్ క్లిప్‎ను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆర్మీ ఈస్ట్ కమాండ్. 

1971, ఆగస్టు 5.. ఈ రోజు, ఆ సంవత్సరం యుద్ధం ప్రారంభమైందని ఈ పోస్టులో రాసుకొచ్చింది. ఆర్మీ ఈస్ట్ కమాండ్ షేర్ చేసిన కథనం సారాంశమేమిటంటే.. 1954 నుంచి పాకిస్తాన్‌కు 2 బిలియన్ల విలువైన యూఎస్ ఆయుధాలు రవాణా చేయబడ్డాయని. ఈ ఆర్టికల్‎ను అప్పటి రక్షణ ఉత్పత్తి మంత్రి వీసీ శుక్లా పార్లమెంటులో చేసిన ప్రసంగాన్ని ఉటంకిస్తూ రాశారు. 

ఇందులో ఫ్రాన్స్, సోవియట్ యూనియన్ (రష్యా) పాకిస్తాన్‌కు ఆయుధాల అమ్మకాలను తిరస్కరించినప్పటికీ.. అమెరికా మాత్రం దాయాది దేశానికి ఆయుధాల సరఫరాను కొనసాగించిందని ప్రస్తావించారు. యుద్ధంలో పాకిస్థాన్‎కు చైనా, అమెరికా రెండు దేశాలు ఆయుధ సహయం అందజేశాయని పేర్కొన్నారు. ఆ రెండు దేశాల ఆయుధాలతోనే 1971 వార్‏లో పాకిస్థాన్ భారత్‎పై పోరాడిందని రాశారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడం కరెక్ట్ కాదంటూ ట్రంప్ వ్యాఖ్యానించిన 24 గంటల్లోనే  భారత ఆర్మీ గతాన్ని గుర్తు చేసి అమెరికా అధ్యక్షుడికి ఇన్‎డైరెక్ట్‎గా కౌంటర్ ఇచ్చింది.