పబ్‌జీ బ్యాన్‌తో.. మిగతా గేమింగ్​ కంపెనీలకు జోష్

పబ్‌జీ బ్యాన్‌తో.. మిగతా గేమింగ్​ కంపెనీలకు జోష్

ఫ్రీ ఫైర్, సీఓడీ మొబైల్‌ కి పెరిగిన డౌన్‌ లోడ్స్
సెన్సర్ టవర్ డేటాలో వెల్లడి
పబ్‌ జీకి వరల్డ్‌ వైడ్‌‌గా 3.5 బిలియన్ డాలర్లు
41.2 మిలియన్ డాలర్లు ఇండియా నుంచే

న్యూఢిల్లీ : ప్లేయర్ అన్‌‌నౌన్ బ్యాటిల్‌‌గ్రౌండ్‌‌( పబ్‌‌జీ) మొబైల్ గేమ్‌‌ బ్యాన్‌‌తో ప్రత్యర్థి గ్లోబల్ గేమింగ్ కంపెనీలకు మంచి జోష్ వచ్చింది. పబ్‌‌జీ బ్యాన్‌‌తో ఇండియన్ గేమర్స్ ఇతర గేమ్స్‌‌ను సెర్చ్ చేసి డౌన్‌‌లోడ్ చేసుకుంటున్నారు. వర్చ్యువల్ గేమింగ్ ప్లాట్‌‌ఫామ్స్‌‌లో పబ్‌‌జీ చాలా పాపులర్ అయింది. ఈ గేమ్‌‌ను ఒక్కసారిగా బ్యాన్ చేయడం, గేమర్లలో మస్తు నిరాశను కలిగించింది. పబ్‌‌జీ లేకపోవడంతో, ఇతర గేమ్స్ ఏమి ఉన్నాయా..? అని గేమర్లు వెతుకుతున్నారు. దీంతో పబ్‌‌జీ ప్రత్యర్థ గ్లోబల్ గేమింగ్ కంపెనీలకు మస్తు జోష్ వచ్చింది. పబ్‌‌జీ ప్రత్యర్థి గేమ్స్ గరేనా ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ(సీఓడీ) మొబైల్ వంటి గేమ్స్‌‌కు డౌన్‌‌లోడ్స్ పెరిగాయి. ఈ నెల 2న పబ్‌‌జీపై వేటు పడ్డ తర్వాత  వీటి డౌన్‌‌లోడ్స్ బాగా పెరిగినట్టు తెలిసింది. యాప్ అనలటిక్స్ సంస్థ సెన్సర్ టవర్‌‌‌‌ డేటా ప్రకారం, ఫ్రీ ఫైర్‌‌ 3.7 మిలియన్‌‌ టైమ్స్, సీఓడీ మొబైల్‌‌ 1.4 మిలియన్ టైమ్స్ డౌన్‌‌లోడ్ అయ్యాయి. గత వారం నుంచి ఫ్రీ ఫైర్ డౌన్‌‌లోడ్స్ 147 శాతం, సీఓడీ మొబైల్ డౌన్‌‌లోడ్స్ 267 శాతం పెరిగినట్టు సెన్సర్ టవర్ డేటాలో వెల్లడైంది. వర్చ్యువల్ గేమింగ్ ఇండస్ట్రీని గత కొన్నేళ్లుగా కొన్ని గేమ్స్ మాత్రమే డామినెట్ చేస్తున్నాయి. కొత్తగా వచ్చే వారికి ఈ గేమింగ్ ఇండస్ట్రీ చాలా దూరంలో ఉంటోంది. ఇండస్ట్రీ డేటా ప్రకారం దేశీయ గేమింగ్ మార్కెట్‌‌లో సుమారు నాలిగింట మూడు వంతులు ఆన్‌‌లైన్ గేమింగ్ ప్లాట్‌‌ఫామ్సే ఉన్నాయి. స్మార్ట్‌‌ఫోన్ యూజర్లు పెరగడంతో ఆన్‌‌లైన్ గేమింగ్ ప్లాట్‌‌ఫామ్స్ పెరిగాయి. గూగుల్–కేపీఎంజీ రిపోర్ట ప్రకారం 2021 నాటికి ఇండియాలో ఆన్‌‌లైన్ గేమింగ్ సెగ్మెంట్ 1.1 బిలియన్ డాలర్ల అవకాశాలను అందిస్తుందని తెలిసింది. ఇండియాలో 62.8 కోట్ల మందికి పైగా గేమర్స్ ఉంటారని కూడా అంచనాలున్నాయి. కన్సోల్స్‌‌ గేమింగ్ నుంచి వచ్చే రెవెన్యూలు కంటే, మొబైల్ గేమింగ్ వల్లనే మార్కెట్ షేరు ఎక్కువగా ఉంటుందని ఎక్స్‌‌పర్ట్‌‌లు చెబుతున్నారు. చాలా మంది గేమ్ డెవలపర్స్‌‌ కూడా మొబైల్ ప్లాట్‌‌ఫామ్స్‌‌వైపుకే వెళ్తున్నారు.

పబ్‌‌జీ బ్యాన్‌‌తో 34 బిలియన్ డాలర్ల నష్టం..

పబ్‌‌జీ నిషేధంతో టెన్సెంట్‌‌కు 34 బిలియన్ డాలర్ల నష్టం వచ్చినట్టు ఎక్స్‌‌పర్ట్‌‌లు చెబుతున్నారు. పబ్‌‌జీతో పాటు టెన్సెంట్‌‌కు చెందిన వీ ఛాట్ యాప్‌‌ను కూడా కేంద్రం బ్యాన్ చేసింది. పబ్‌‌జీ యాప్‌‌ పరంగా చూసుకుంటే, ఇండియా టెన్సెంట్‌‌కు అతిపెద్ద మార్కెట్‌‌గా ఉంది. సెక్యూరిటీ సమస్యలున్నాయనే కారణంతో చైనాకు చెందిన 118 యాప్స్‌‌ను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఇండియాలో పబ్‌‌జీకి సుమారు 4 కోట్ల మంది యాక్టివ్ యూజర్లున్నారు. ఈ గేమ్‌‌కి బానిసై సూసైడ్ చేసుకున్న వారు ఉన్నారు.  పబ్‌‌జీ ఈస్పోర్ట్స్ కమ్యూనిటీలో చాలా ఇంపార్టెంట్‌‌గా ఉంటూ వచ్చింది. చాలా మంది యూజర్లు పబ్‌‌జీ ఫుల్‌‌ టైమ్ కెరీర్‌‌‌‌గా తీసుకున్న వేలల్లో మనీని సంపాదించేవారు. ఈ బ్యాన్‌‌ వారిని ఫైనాన్సియల్‌‌గా దెబ్బతీసింది.

పబ్‌‌జీకి ఇండియన్ ఆల్టర్నేటివ్ లేదు…

సెన్సర్‌‌‌‌ టవర్‌‌‌‌ డేటా ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా పబ్‌‌జీ 3.5 బిలియన్ డాలర్లను పొందింది. దీనిలో ఇండియా నుంచే 41.2 మిలియన్ డాలర్లు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్ట్ 31 మధ్య కాలంలో ఇండియాలో టాప్ గ్రాస్ యాప్‌‌గా పబ్‌‌జీ మొబైల్ ఉంది. షార్ట్‌‌ వీడియో యాప్ టిక్‌‌టాక్‌‌ను బ్యాన్ చేసినప్పుడు ఇండియాలో అలాంటి షార్ట్ వీడియో యాప్స్‌‌ లేవు. అలాగే పబ్‌‌జీకి కూడా ఇండియన్ ఆల్టర్నేటివ్ లేదు. దీంతో ఫారిన్‌‌ ప్లేయర్స్ బాగా లబ్ది పొందుతున్నారు. నాన్ చైనీస్ గేమ్ పబ్లిషర్స్ ఇండియాలో దూసుకుపోతున్నారు. పబ్‌‌జీ మొబైల్‌‌లో ఇన్‌‌యాప్ ఐటమ్స్‌‌ను కొన్న యూజర్లు నష్టపోతారని ఈస్పోర్ట్స్ సంస్థ నియోన్ గేమింగ్‌‌ను రన్ చేసే హర్ష్ కొఠారి తెలిపారు.