బిజినెస్ డెస్క్, వెలుగు: వర్క్ ఫ్రం హోమ్… ఉద్యోగులకు సౌకర్యవంతమే అయినా కొందరికి పన్ను మొత్తం పెరిగే అవకాశం ఉంది. ఎలాగో ఒక ఉదాహరణ చూద్దాం. హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. కరోనా కారణంగా కచ్చితంగా ఇంటి నుంచే పనిచేయాలని కంపెనీ ఆదేశించింది. దీంతో ఆయన జూలైలోనే హైదరాబాద్ అద్దెంటిని ఖాళీ చేసి ఇంటికి వెళ్లిపోయాడు. దీనివల్ల అద్దె మొత్తం మిగులుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా, శ్రీనివాస్ తన తల్లిదండ్రులతో ఉన్నంతకాలం హౌజ్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడం సాధ్యం కాదు. ఫలితంగా చెల్లించాల్సిన పన్ను విలువ పెరుగుతుంది. ఇదొక్క శ్రీనివాస్ పరిస్థితే కాదు. లాక్డౌన్ విధించిన తరువాత చాలా మంది ఉద్యోగులు అద్దిండ్లను వదిలేసి సొంతూళ్ల బాట పట్టారు. అక్కడి నుంచే పనిచేసుకుంటున్నారు. ఇలాంటి వారందరికీ హెచ్ఆర్ఏ మినహాయింపు ఉండకపోవచ్చని ట్యాక్స్ ప్లానర్లు అంటున్నారు. మరికొందరు సిటీల్లోనూ ఉంటూ యజమానిపై ఒత్తిడి తెచ్చి ఇంటి అద్దెను తగ్గించుకున్నారు.
హెచ్ఆర్ఏ లెక్కింపు ఇలా..
ఐటీ చట్టం సెక్షన్ 10 (13ఏ) ప్రకారం ఉద్యోగి జీతంలో హెచ్ఆర్ఏ కూడా భాగమే! చెల్లించిన అద్దె మొత్తానికి పన్ను మినహాయింపు పొందే వెసులుబాటు ఉంటుంది. నివసించే నగరం, పట్టణం, గ్రామీణ ప్రాంతాన్ని బట్టి ఇందులో హెచ్చుతగ్గులు ఉంటాయి. మెట్రో నగరాల వాళ్లు ఎక్కువ మొత్తాన్ని, చిన్న పట్టణాల ఉద్యోగులు తక్కువ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ‘‘సొంతింటి నుంచే పనిచేసే వారికి కిరాయి ఏమీ లేదు కాబట్టి ఇంటి నుంచి పనిచేసిన కాలానికి హెచ్ఆర్ఏను క్లెయిమ్ చేసుకోవడం సాధ్యం కాదు”అని ఏకేఎం అనే కన్సల్టింగ్ ఫర్మ్ డైరెక్టర్ శిల్పా భాటియా అన్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి నెలకు రూ.15 వేలు హెచ్ఆర్ఏగా పొందుతున్నాడు. ఇంతే మొత్తాన్ని అద్దెగా చెల్లిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలలపాటు కిరాయి కట్టలేదు కాబట్టి అతడు పన్ను కట్టాల్సిన మొత్తం విలువ రూ.1.35 లక్షలకు పెరుగుతుంది. ఉద్యోగి 20 శాతంట్యాక్స్ బ్రాకెట్లోకి వస్తే రూ.27 వేల వరకు కట్టాలి. అయితే ఇంటి నుంచి పనిచేసే సమయంలో కొంత మొత్తం కుటుంబ సభ్యుడికి చెల్లిస్తే.. ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, అతడు/ఆమె ఆ మొత్తాన్ని తన ఐటీఆర్లో చూపించాలి. సొంతింట్లో ఉంటే ఇలాంటి చెల్లింపుల అవసరం రాదు కానీ బంధువులు లేదా స్నేహితుల ఇంట్లో ఉండి వారికి కొంత మొత్తం ఇస్తే డిడక్షన్ వర్తిస్తుందని సీనియర్ ట్యాక్స్ప్లానర్ ఒకరు అన్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని కిరాయి వివరాలన్నీ ముందుగానే కంపెనీ హెచ్ఆర్కు తెలియజేయాలి.