
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అప్పు డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని ఒక మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురి చేశారు. ఈ దారుణమైన ఘటన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో వెలుగు చూసింది. మహిళల వైపు తప్పుగా కన్నెత్తి చూసిన తాట తీస్తామని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పబ్లిక్ మీటింగుల్లో భారీ భారీ డైలాగులు చెబుతుంటే.. ఏకంగా సీఎం సొంత నియోజకవర్గంలోనే మహిళను చెట్టుకు కట్టేసి అవమానించిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.
వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత మునికన్నప్ప దగ్గర 3 సంవత్సరాల క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నాడు. అప్పు డబ్బులు తిరిగి చెల్లించలేక భార్య, బిడ్డల్ని వదిలి గ్రామాన్ని విడిచివెళ్లిపోయాడు. దీంతో తిమ్మరాయప్ప భార్య శిరీష కూలీ పనులు చేస్తూ పిల్లల్ని పోషించుకుంటూ అప్పులు తీరుస్తోంది. ఆర్ధిక ఇబ్బందుల వల్ల అప్పు చెల్లించడం కాస్త ఆలస్యమైంది.
— Manohar Reddy (@ManoharRed18542) June 17, 2025
సకాలంలో అప్పు డబ్బులు చెల్లించలేదని తీవ్ర ఆగ్రహానికి గురైన మునికన్నప్ప.. శిరీష రోడ్డుపై వెళ్తుండగా అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు. తన అప్పు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. అంతటితో ఆగకుండా నడి రోడ్డుపై శిరీషను ఈడ్చుకొంటూ వెళ్ళి చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు. ఈ దారుణాన్ని స్థానికులు వీడియో తీస్తుండగా వారిపైన మునికన్నప్ప భౌతిక దాడి చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో పాటు స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కుప్పం పోలీసులు రంగంలోకి దిగారు. మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టిన టీడీపీ కార్యకర్త మునికన్నప్పపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మునికన్నప్పను అదుపులోకి తీసుకున్నారు. తన సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.