లాక్‌డౌన్‌ వేళ.. పోలీస్‌ వ్యాన్‌లో డెలివరీ

లాక్‌డౌన్‌ వేళ.. పోలీస్‌ వ్యాన్‌లో డెలివరీ
  •  ఢిల్లీలో ఆడపిల్లకు జన్మనిచ్చిన మహిళ

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశమంతటా విధించిన లాక్‌డౌన్‌ వల్ల ట్రాన్స్‌పోర్ట్‌ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశరాజధానిలో ఒక మహిళ పోలీస్‌ వాహనంలోనే డెలివరీ అయింది. దక్షిణ ఢిల్లీలోని కిద్వాయి నగర్‌‌లో కార్మికుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడారాల్లో ఉండే గర్భిణీకి బుధవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫోన్‌ చేయగా వారు వెంటనే వాహనాన్ని ఏర్పాటు చేశారు. గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ టైంలో వెహికిల్‌లో నలుగురు మహిళా పోలీసులు ఉన్నారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని, వారిని సఫ్దర్‌‌ గంజ్‌ హాస్పిటల్‌కు తరలించామని వారు చెప్పారు.