
- ఉమ్మడి జిల్లాలో మహిళా సంఘాలకు యాసంగి కమీషన్కింద రూ.22.66 కోట్లు
- ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ
- వడ్ల కొనుగోలులో ఐకేపీ కీలక పాత్ర
నల్గొండ, యాదాద్రి, వెలుగు : వడ్ల కొనుగోలులో మహిళా సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. దీంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వడ్లు కొనుగోలు చేయడంతో మహిళా సంఘాలు లాభాల బాటపట్టాయి. 2023–-24 ఫైనాన్స్ ఇయర్లోని యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించిన కమీషన్ ఒకేసారి రిలీజ్ చేసింది. సంఘాలకు ఒకేసారి పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తోంది.
దళారుల ప్రమేయం లేకుండా..
వడ్ల కొనుగోలులో దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం ప్రతీ సీజన్లో వందలాది సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. ఐకేపీ, పీఏసీఎస్, ఫార్మర్ప్రొడ్యూసర్స్ఆర్గనైజేషన్స్ (ఎఫ్పీవో), మార్కెట్కమిటీలు కొనుగోలులో పాలుపంచుకుంటున్నాయి. అయితే ఇందులో ఎక్కువగా మహిళా సంఘాల నేతృత్వంలో నడిచే ఐకేపీ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వడ్ల కొనుగోలు 40 శాతం వరకు ఐకేపీ సెంటర్లలోనే ఉంటోంది. మిగిలిన వడ్లను పీఏసీఎస్, ఎఫ్పీవో, మార్కెట్కమిటీల ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నారు.
రూ. కోట్లలో కమీషన్..
కొనుగోలు ప్రక్రియలో పాలుపంచుకుంటున్నందుకు మహిళా సంఘాలకు క్వింటాల్కు రూ.32 చొప్పున ప్రభుత్వం కమీషన్అందిస్తోంది. ఈ కమీషన్ ద్వారా మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. కాగా 2023–-24 ఫైనాస్స్ ఇయర్కు సంబంధించిన యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించిన కమీషన్ను ప్రభుత్వం ఇటీవల
విడుదల చేసింది.
నల్గొండకు రూ. 7.53 కోట్లు..
నల్గొండ జిల్లాలో మొత్తం స్వయం సహాయక సంఘాలు 28,285 ఉన్నాయి. మండల సమాఖ్యలు 32 ఉన్నాయి. 2023 –-24 యాసంగి సీజన్ లో 85 ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయగా,11,75,540 క్వింటాళ్ల వడ్లను సేకరించారు. ఇందుకు రూ.3.76 కోట్ల కమీషన్ అందుకుంటున్నారు. 2023 –-24 వానాకాలం సీజన్ లో 11,80,666 క్వింటాళ్ల వడ్లను కొనుగోలు చేశారు. దీంతో రూ.3.77 కోట్ల కమిషన్ మహిళా సంఘాలు పొందుతున్నాయి.
యాదాద్రి జిల్లాలో రూ.5.25 కోట్లు..
2023-–24 యాసంగి సీజన్లో 85 ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటిల్లో 9,62,918 క్వింటాళ్ల వడ్లను కొనుగోలు చేశారు. రూ.2,98,50,644 కమీషన్వచ్చింది. వానాకాలం సీజన్లో 85 సెంటర్లు ఏర్పాటు చేయగా.. 7,31,469 క్వింటాళ్ల వడ్లు కొనుగోలు చేశారు. ఇందుకు రూ.2.26 కోట్ల కమీషన్వచ్చింది. రెండు సీజన్లు కలిపి మొత్తంగా రూ.5.25 కోట్ల కమీషన్వచ్చింది.
సూర్యాపేట జిల్లాలో..
2024- –25 వానాకాలం సీజన్లో సూర్యాపేట జిల్లాలో 153 సెంటర్లు ద్వారా 12.30 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. దీంతో మహిళలకు రూ.3.94 కోట్ల కమీషన్ రానుంది. 2024-– 25 యాసంగి సీజన్లో 163 సెంటర్లు ద్వారా 17.49 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. దీని ద్వారా మహిళా సంఘాలకు రూ. 5.94 లక్షల కమీషన్
పొందనున్నారు.
మహిళలకు ప్రయోజనం
ఐకేపీ సెంటర్ల ద్వారా చేస్తున్న వడ్ల కొనుగోలులో మహిళా సంఘాలు కీలకంగా పనిచేస్తున్నాయి. దీంతో వారు రూ.కోట్లు కమీషన్ పొందుతున్నారు. తద్వారా సంఘాలు, సభ్యులు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు.
వి.అప్పారావు, డీఆర్డీవో, సూర్యాపేట