
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
- సభలో జూనియర్ ఎమ్మెల్యేల మాటలు బాధించాయి: సునీతా లక్ష్మారెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళలు భయంతో బతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. ఈ అంశాన్ని తాను అసెంబ్లీలో ప్రస్తావించానని, తనకు మైక్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి భయపడుతున్నారని దుయ్యబట్టారు.
తాము నాలుగున్నర గంటలు అసెంబ్లీలో నిలబడితే సీఎం, అధికార పక్షం వాళ్లు రాక్షసానందం పొందారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం పదవి కోసం కొట్లాడాల్సిన భట్టి.. సీఎల్పీ పదవి మా వల్ల పోయిందంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ఆడబిడ్డలను అవమానించడం సీఎంకు నిత్యకృత్యంగా మా రిందన్నారు.
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై శుక్రవారం సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ఆమె తెలిపారు. సభలో జూనియర్ ఎమ్మెల్యేల మాటలు బాధించాయని బీఆర్ఎస్ ఎ మ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. స్పీకర్ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీతక్కకు కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పినట్టే.. సునీతారెడ్డి, సబితారెడ్డికి సీఎం క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే కోవా లక్ష్మి డిమాండ్ చేశారు.