కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ ను కఠినంగా పాటించాలని, దీనిని విజయవంతం చేసేందుకు తన తండ్రి అంత్యక్రియలకు సైతం వెళ్లడం లేదని చెప్పారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. తండ్రిని ఆఖరి చూపు చూడాలని ఉన్నా 23 కోట్ల మంది ప్రజల క్షేమం దృష్ట్యా కరోనాపై పోరాటంలో తన కర్తవ్యానికి కట్టుబడి ఆగిపోతున్నానని చెప్పారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్యంతో న్యూఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
అమ్మ, స్నేహితులే చూసుకోవాలని విజ్ఞప్తి
కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ ను విజయవంతం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే మంగవారం జరిగే అంత్యక్రియలకు రాలేకపోతున్నానని యోగి ట్వీట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని 23 కోట్ల మంది ప్రజలను కరోనా మహమ్మారి నుంచి కాపాడే కర్తవ్య నిర్వహణ వల్ల తండ్రిని చివరి చూపు చూడాలని ఉన్నా కుదరడం లేదన్నారు. తల్లి, స్నేహితులు అంత్యక్రియల కార్యక్రమం చూడాలని కోరుతున్నానని అన్నారు.
