
నిజామాబాద్జిల్లా కేంద్రంలో గురువారం పారిశుద్ధ్య పనులు చేపడుతున్న మున్సిపల్ కార్మికుడు పైప్ లైన్ లో ఇరుక్కుపోయి సుమారు 2గంటల పాటు డ్రైనేజీలోనే ఉండిపోయాడు. ఊపిరి బిగబట్టుకుని నరకయాతన అనుభవించాడు. 16వ డివిజన్ పరిధిలోని చంద్రనగర్ శ్మశానవాటిక వద్ద ఉన్న మురికి కాలువ పైప్ లైన్ లో చెత్తచెదారం, పూడిక తీసేందుకు గంగాధర్ అనే కార్మికుడు అందులోకి వెళ్లాడు.
లోపలికి వెళ్లగానే ఒక్కసారిగా మురుగునీటి ప్రవాహం రావడంతో ఎటూ కదల్లేక అందులోనే ఇరుక్కుపోయాడు. అతనితోపాటు వెళ్లిన మరో కార్మికుడు ఆశయ్య క్షేమంగా పైకి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ఆఫీసర్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీని తెప్పించి రెండు వైపుల నుంచి తవ్వకాలు ప్రారంభించి కార్మికుడిని సురక్షితంగా బయటకు తీశారు.