
వాషింగ్టన్: దేశ ప్రయోజనాల కోసం పని చేయడాన్ని పార్టీ వ్యతిరేకం అనేటోళ్లు తమను తామే ప్రశ్నించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. పాక్ టెర్రరిజంపై వివరించేందుకు అమెరికా, తదితర దేశాలకు వెళ్లిన అఖిలపక్ష ఎంపీల బృందానికి నాయకత్వం వహించిన ఆయన బుధవారం పీటీఐ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
‘‘ఎవరైనా దేశం కోసం పని చేస్తున్నప్పుడు, దాని గురించి మరీ ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అలా కాకుండా దేశం కోసం పని చేస్తే పార్టీ వ్యతిరేకమని అని అనేవాళ్లు మమ్మల్ని కాదు.. వాళ్లను వాళ్లే ప్రశ్నించుకోవాలి” అని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ పై కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడటంతోపాటు అఖిల పక్ష బృందంతో విదేశాల్లో పర్యటిస్తున్న ఆయన వివిధ దేశాల్లో భారత్ తరఫున గట్టిగా గళం వినిపించారు.
అయితే, థరూర్ కామెంట్లు కేంద్రానికి అనుకూలంగా, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నాయంటూ సొంత పార్టీలోని పలువురు నేతలు విమర్శించిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. కాగా, పాకిస్తాన్తో యుద్ధ సమయంలో ఇండియా ఎవరి మధ్యవర్తిత్వం కోరలేదని, యుద్ధాన్ని ఆపాలని ఎవరూ చెప్పలేదని శశి థరూర్ అన్నారు. పాక్ ఉగ్రవాదాన్ని నమ్ముకుంటే ఇండియా తన ఆర్మీతో బుద్ధి చెబుతుందన్నారు.