
భోపాల్: వరల్డ్ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి తన పంచ్ పవర్ తో ఫిదా చేసింది. ఈ ఏడాది సూపర్ ఫామ్లో ఉన్న నిఖత్ సీజన్కు గోల్డెన్ ఫినిషింగ్ ఇచ్చింది. నేషనల్ విమెన్స్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో తెలంగాణ స్టార్ మరోసారి గోల్డ్ మెడల్తో మెప్పించింది. సోమవారం జరిగిన 50 కేజీ కేటగిరీ ఫైనల్లో నిఖత్ 4–1 తేడాతో రైల్వేస్ బాక్సర్ అనామికను చిత్తుగా ఓడించి వరుసగా రెండో ఏడాది చాంపియన్ అయ్యింది.
ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ ఈ బౌట్ లో నిఖత్ ఆకట్టుకునే పెర్ఫామెన్స్ చేసింది. అవకాశం చిక్కినప్పుడల్లా అనామికపై పంచ్ల వర్షం కురిపించింది. మూడు రౌండ్లలోనూ అనామికపై ఆధిపత్యం చెలాయించింది. మరోవైపు టోక్యో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ లవ్లీనా బొర్గొహైన్ 75 కేజీ కేటగిరీలో టైటిల్ గెలిచింది. ఫైనల్లో లవ్లీనా (అసోం) 5–0 సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ (ఎస్ఎస్సీబీ) బాక్సర్ అరుంధతి చౌదరి చిత్తు చేసింది.
రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ (ఆర్ఎస్పీబీ) తరఫున బరిలోకి దిగిన మరో స్టార్ బాక్సర్ మంజు రాణి కూడా గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. 2019 వరల్డ్ చాంపియన్షిప్ సిల్వర్ మెడలిస్ట్ అయిన మంజు 4 8 కేజీ ఫైనల్లో 5–0తో తమిళనాడుకు చెందిన ఎస్ కలైవాణిని చిత్తు చేసింది. మణిపూర్ యంగ్ బాక్సర్ సనామచ చాను 70 కేజీ ఫైనల్లో 3–2తో మధ్యప్రదేశ్ బాక్సర్ శ్రుతి యాదవ్ను ఓడించి సంచలనం రేకెత్తించింది.
హర్యానాకు చెందిన మనీష (57), సవీటి (81 కేజీ), ఎస్ఎస్సీబీ బాక్సర్ సాక్షి (52 కేజీ), మధ్యప్రదేశ్కు చెందిన మంజు బంబోరియా (66 కేజీ) బంగారు పతకాలు గెలిచారు. మరోవైపు ఆర్ఎస్పీబీ బాక్సర్లు శిక్షా (54 కేజీ), పూనమ్ (60 కేజీ), సాక్షి చోప్రా (63 కేజీ), నుపూర్ (+81 కేజీ) కూడా తమ వెయిట్ కేటగిరీల్లో గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకున్నారు. మొత్తంగా 12 కేటగిరీల్లో 302 బాక్సర్లు ఈ టోర్నీలో పోటీ పడ్డారు.
రైల్వేస్కు టీమ్ ట్రోఫీ
ఈ టోర్నీలో రైల్వేస్ బాక్సర్లు సూపర్ పెర్పామెన్స్ చేశారు. మొత్తంగా పది మెడల్స్తో రైల్వేస్ జట్టు టీమ్ ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇందులో ఐదు గోల్డ్ మెడల్స్, మూడు సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. మధ్య ప్రదేశ్ ఒక గోల్డ్, రెండు సిల్వర్, ఐదు బ్రాంజ్ మెడల్స్తో రన్నరప్గా నిలిచింది. హర్యానా రెండు గోల్డ్, రెండు బ్రాంజ్ మెడల్స్తో మూడో ప్లేస్ సాధించింది. సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్, బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు విన్నర్లకు మెడల్స్ అందజేశారు.
2022లో నాటౌట్గా..
నిఖత్కు ఈ ఏడాది ఎంతో కలిసొచ్చింది. 2022లో బరిలోకి దిగిన ప్రతీ టోర్నీలో, ప్రతీ బౌట్లో తెలంగాణ బాక్సర్ గెలవడం విశేషం. గాయం నుంచి కోలుకొని ఫిబ్రవరిలో ప్రతిష్టాత్మక స్ట్రాంజా మెమోరియల్ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్తో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చింది. ఈ టోర్నీలో రెండు సార్లు బంగారు పతకం గెలిచిన ఇండియా తొలి విమెన్స్ బాక్సర్గా హిస్టరీ క్రియేట్ చేసింది.
ఆ తర్వాత ఆగస్టులో వరల్డ్ చాంపియన్ షిప్ లో నిఖత్ పేరు మార్మోగిపోయింది. టాప్ క్లాస్ ఆటతో ఎదురైన ప్రత్యర్థినల్లా మట్టికరిపిస్తూ వరల్డ్ చాంపియన్ అయ్యింది. ఆపై, వెయిట్ కేటగిరీ మార్చుకొని ఆగస్టులో కామన్వెల్త్ గేమ్స్లో బరిలోకి దిగిన నిఖత్ ఫామ్ కొనసాగించింది. అలవోకగా గోల్డ్ మెడల్ సొంతం చేసుకొని మరింత పేరు తెచ్చుకుంది.
ఇది నాకు ఎంతో
అపురూపమైన సంవత్సరం. వరుసగా మూడు ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నా. ఇప్పుడు ఎలైట్ విమెన్స్ నేషనల్ బాక్సింగ్లో గోల్డ్ నెగ్గి ఇయర్ ముగిస్తున్నా. నా కోచ్లు జాన్ వార్బర్టన్, భాస్కర్ భట్, స్పాన్సర్లు, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేకపోతే ఈ ఏడాదిని ఓటమి లేకుండా ముగించడం సాధ్యం అయ్యేది కాదు. –నిఖత్ జరీన్