
జాగ్రెబ్ (క్రొయేషియా): ఇండియా రెజ్లర్ సుజీత్ కల్కల్.. వరల్డ్ చాంపియన్షిప్లో పోరాడి ఓడాడు. సోమవారం జరిగిన మెన్స్ 65 కేజీ క్వార్టర్ ఫైనల్లో సుజీత్ 5–6తో పారిస్ ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ రెహమన్ మౌసా అంజద్ ఖలీ (ఇరాన్) చేతిలో పరాజయం చవిచూశాడు. 2022 వరల్డ్ చాంపియన్షిప్తో పోలిస్తే సుజీత్ ఆట మెరుగ్గా ఉన్నా.. ఇరాన్ రెజ్లర్ బలం ముందు నిలువలేకపోయాడు. ఇద్దరు రెజ్లర్లు హోరాహోరీగా తలపడటంతో తొలి పీరియడ్లో సుజీత్కు పాయింట్లు దక్కలేదు. కానీ రెండో పీరియడ్లో రెహమాన్ పట్టు బిగించి 4–0 లీడ్లో నిలిచాడు.
ఈ క్రమంలో సుజీత్ తొలి టేక్ డౌన్ కోసం ప్రయత్నించి కుడి కాలుతో అటాక్ చేశాడు. దీన్ని రెహమాన్ కౌంటర్ చేసి 6–3 ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే 20 సెకన్లలోపే పట్టు విడవడంతో సుజీత్ మరో టేక్ డౌన్ చేసి స్కోరును 5–6కు తగ్గించాడు. ఒకవేళ రెహమాన్ ఫైనల్స్కు చేరుకుంటే సుజీత్కు రెప్చేజ్ రౌండ్ ఆడే చాన్స్ ఉంటుంది. అంతకుముందు జరిగిన బౌట్స్లో సుజీత్ 15–5తో కావిట్ అకార్ (టర్కీ)పై, 9–2తో క్వాన్ జిమ్ కిన్ (కొరియా)పై గెలిచి క్వార్టర్స్లోకి అడుగుపెట్టాడు. మరో క్వార్టర్స్లో విక్కీ.. అమిరాలి హమిద్ అజ్రాపిరా (ఇరాన్) చేతిలో ఓడాడు. విమెన్స్ 55 కేజీల్లో నిషు.. సోవోకా ఉచిడా (జపాన్) చేతిలో ఓడింది. జపాన్ రెజ్లర్ సెమీస్ చేరడంతో నిషుకు రెప్చేజ్ ఆశలు ఉన్నాయి. 59 కేజీ ప్రిక్వార్టర్స్లో సారిక.. అనస్తాసియా సిడెలిన్కోవా చేతిలో ఓడింది.