
న్యూఢిల్లీ: డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్ట్ చేయాలంటూ ఆందోళన చేస్తున్న ఇండియా టాప్ రెజ్లర్లు కాస్త వెనక్కి తగ్గారు. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ నెల 15వ తేదీ వరకు ఆందోళనను నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రతిగా కొత్త పార్లమెంట్ వద్ద మహా పంచాయత్ నిర్వహించేందుకు వెళ్లే క్రమంలో అరెస్టైనప్పుడు వారిపై నమోదైన కేసులను విత్డ్రా చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
బజ్రంగ్ పునియా, సాక్షి మాలిక్, సత్యవర్త్ కడియన్, జితేందర్ కిన్హా బుధవారం ఢిల్లీలో స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ సింగ్ ఠాకూర్తో దాదాపు ఐదు గంటల పాటు చర్చలు జరిపారు. ‘బ్రిజ్పై నమోదైన కేసుల్లో విచారణ ఈ నెల 15న పూర్తవుతుందని, అప్పటిదాకా నిరసన నిలిపివేయాలని మాకు సూచించారు. గత నెల 28న రెజ్లర్లపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను ఢిల్లీ పోలీసులు విత్డ్రా చేస్తారని హామీ ఇచ్చారు’ అని సాక్షి తెలిపింది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు వారం పాటు నిరసన నిలిపివేస్తున్నామని సాక్షి, బజ్రంగ్ తెలిపారు. ఇక, రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలు ఈనెల30న జరుగుతాయని అనురాగ్ ప్రకటించారు.