కూలీలుగా బీపీఎడ్​ స్టూడెంట్లు

కూలీలుగా బీపీఎడ్​ స్టూడెంట్లు

హనుమకొండ/కేయూ క్యాంపస్, వెలుగు: పుస్తకాలతో కుస్తీ పట్టి.. ప్లే గ్రౌండ్​లో చురుకుగా కదలాల్సిన క్రీడాకారులు లేబర్​ అవతారమెత్తిన్రు. లేబర్​ తో పనులు చేయించాల్సిన ఆఫీసర్లు  స్టూడెంట్స్​ను కూలీలుగా మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఈ నెల 17 నుంచి 20 వరకు సౌత్​ ఇండియా విమెన్​ ఖోఖో పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు సౌత్​ ఇండియాలోని 8 రాష్ట్రాల నుంచి 60 యూనివర్సిటీలకు చెందిన దాదాపు వెయ్యి మంది స్టూడెంట్స్​తరలిరానున్నారు. ఇందుకోసం కేయూ గ్రౌండ్​ను రెడీ చేయాల్సి ఉంది. గ్రౌండ్​ను ఆటలకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు వర్సిటీ ఆఫీసర్లు ప్రత్యేకంగా నిధులు కూడా రిలీజ్​ చేశారు. కానీ స్పోర్ట్స్​ బోర్డు ఆఫీసర్లు పైసా ఖర్చు లేకుండా క్యాంపస్​లోని బీపీఎడ్​(బ్యాచ్ లర్​ఆఫ్​ ఫిజికల్​ఎడ్యుకేషన్)  స్టూడెంట్స్ తో చేయించారు. మూడు రోజులుగా పనులు చేయిస్తుండటంతో స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారు. అది తమ పని కాదని ఆఫీసర్లకు ఎదురు చెబితే.. ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వాపోతున్నారు. దీంతో ఏబీవీపీ నేతలు బుధవారం ఉదయం స్పోర్ట్స్​ బోర్డు ఆఫీస్​ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ విషయమై స్పోర్ట్స్​సెక్రటరీ సవితా జోత్స్నను వివరణ కోరగా.. బీపీఎడ్​ స్టూడెంట్లతో గ్రౌండ్​ను చదును చేయించినట్లు తెలిపారు. మట్టి  పోసి చదును చేయడం వల్ల పిల్లలకు  గ్రౌండ్​పై అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు.