ప్రశాంత్​ను కాపాడలేకపోయాం : హనుమంతు జెండగే

ప్రశాంత్​ను కాపాడలేకపోయాం : హనుమంతు జెండగే

యాదాద్రి, వెలుగు : అన్ని ప్రయత్నాలు చేసినా స్టూడెంట్​ప్రశాంత్​ను కాపాడుకోలేకపోయామని యాదాద్రి కలెక్టర్ హనుమంతు జెండగే తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు ఈనెల 11న అస్వస్థతకు గురైనప్పటి నుంచి వారికి మెరుగైన వైద్య చికిత్స కోసం అన్ని ప్రయత్నాలు చేశామన్నారు. హైదరాబాద్​లోని గాంధీ హాస్పిటల్, మిరకిల్ హాస్పిటల్​లో తుర్కపల్లి తహసీల్దార్, ఉస్మానియా హాస్పిటల్, బంజారాహిల్స్ రెయిన్ బో హాస్పిటల్స్ లో పోచంపల్లి తహసీల్దార్,  భువనగిరి ఏరియా ఆస్పత్రిలో భువనగిరి తహసీల్దార్లను పర్యవేక్షకులుగా నియమించినట్లు తెలిపారు. 

రెయిన్ బో హాస్పిటల్ లో స్టూడెంట్ ప్రశాంత్​ కోసం ప్రత్యేకంగా చౌటుప్పల్ ఆర్డీవోను నియమించామని చెప్పారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకొని మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేశామన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇతర అనారోగ్య కారణాలతో ప్రశాంత్​చనిపోయారని తెలిపారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం తమవంతు కృషి చేస్తామన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్​శ్రీరామ్​శ్రీనివాస్​ను సస్పెండ్​ చేశామని చెప్పారు. గురుకులంలోని వాటర్, కూరగాయల శాంపిల్స్​ను టెస్ట్​ల కోసం పంపించామని వివరించారు.