స్లాట్బుకింగ్‌‌ లో చీటింగ్.. యాదాద్రి జిల్లాలో 1300 భూ రిజిస్ట్రేషన్ల లో ఫ్రాడ్‌‌

స్లాట్బుకింగ్‌‌ లో చీటింగ్.. యాదాద్రి జిల్లాలో 1300 భూ రిజిస్ట్రేషన్ల లో ఫ్రాడ్‌‌
  •     ఉలిక్కిపడిన రెవెన్యూడిపార్ట్​మెంట్​
  •     అక్రమాలపై ఆర్డీవోలకు విచారణాధికారం

యాదాద్రి, వెలుగు: భూ రిజిస్ట్రేషన్ల స్లాట్​ బుకింగ్‌‌లో చీటింగ్ వెలుగులోకి రావడంతో యాదాద్రి జిల్లాలో కలవరం మొదలైంది. ఈ చీటింగ్​ వ్యవహారంలో జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తుల పాత్ర ఉండడం, వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో రెవెన్యూ డిపార్ట్‌‌మెంట్​ ఉలిక్కిపడింది. ఈ వ్యవహారంపై కలెక్టర్​ హనుమంతరావు సీరియస్​గా స్పందించారు. ఇద్దరు ఆర్డీవోలను విచారణాధికారులుగా నియమించారు. 

రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు ఫ్రాడ్..

రిజిస్ట్రేషన్ల స్లాట్​ బుకింగ్‌‌లో చీటింగ్​  వ్యవహారం జనగామ జిల్లాలో వెలుగు చూసింది. దీంతో సీరియస్​గా స్పందించిన ప్రభుత్వం ఏస్థాయిలో ఫ్రాడ్​ జరిగిందనే దానిపై ప్రాథమికంగా విచారణ నిర్వహించింది.  యాదాద్రి జిల్లాలో 1300 రిజిస్ట్రేషన్ల స్లాట్​ బుకింగ్‌‌లో అవకతకవకలు జరిగినట్టుగా గుర్తించింది. అయితే ఈ వ్యహారంలో జిల్లావ్యాప్తంగా కనీసం రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్లు ఫ్రాడ్​ జరిగినట్టుగా జిల్లా  రెవెన్యూ డిపార్ట్​మెంట్ అంచానా వేస్తున్నది. దీంతో పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించేందుకు యాదాద్రి కలెక్టర్​ హనమంతరావు చర్యలు ప్రారంభించారు. 

మాన్యువల్‌‌గా చెకింగ్​ 

ఈ చీటింగ్​ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు భువనగిరి, చౌటుప్పల్​ ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్‌‌‌‌రెడ్డిని కలెక్టర్​ హనుమంతరావు విచారణాధికారులుగా నియమించారు. వీరిద్దరూ గడిచిన మూడు నుంచి నాలుగేండ్లలో జరిగిన భూ రిజిస్ట్రేషన్ల వివరాలను సేకరించి, వాటిని చెక్‌‌​ చేయనున్నారు. జిల్లాలోని 17 మండలాల్లోని తహసీల్దార్​ ఆఫీసుల్లో జరిగిన లావాదేవీలను పరిశీలించాల్సి ఉంటుంది. 

ప్రతి భూమి రిజిస్ట్రేషన్​ స్లాట్​ బుకింగ్​ ఎక్కడ జరిగింది? భూమి మార్కెట్​ విలువ ప్రకారం చలానా​ చెల్లించారా? లేదా? అన్నది పరిశీలించనున్నారు. ప్రభుత్వ ఖజానాకు ఎంత మొత్తం జమ అయిందో తేల్చనున్నారు. ఈ పరిశీలన పూర్తయితే కానీ ఏ స్థాయిలో ఫ్రాడ్​ జరిగింది? అన్న విషయంలో స్పష్టత వస్తుంది. ఆ తర్వాతే రికవరీ అంశం తెరపైకి రానున్నది. . 

రెవెన్యూ వర్గాల్లో కలవరం

స్లాట్​ బుకింగ్​ వ్యవహారంలో పెద్ద ఎత్తున జరిగిన చీటింగ్​ వ్యవహారంలో వరంగల్​ పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు ఇంటర్‌‌‌‌నెట్​ సెంటర్ల నిర్వాహకులే ఉన్నారా? ఇంకా ఎవరైనా  అధికారులు ఉన్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విషయంలో వరంగల్​ పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున ఫ్రాడ్​ జరిగినట్టుగా తేలడంతో రెవెన్యూ వర్గాల్లో కలవరం మొదలైంది. 

భూమిని రిజిస్ట్రేషన్​ చేసే సమయంలో డాక్యుమెంట్​ రెండు లేదా మూడో పేజీలోని ‘ఎండార్స్‌‌మెంట్’​ను పరిశీలిస్తే ఎంత మొత్తంలో చలాన్‌‌​ చెల్లించారో తేలిపోతుంది. అయితే ఈ విషయాన్ని తహసీల్దార్లు పట్టించుకోకపోవడం వల్ల ఫ్రాడ్​కు ఊతమిచ్చినట్టుగా ప్రచారం జరుగుతున్నది. ఈ విషయంలో తహసీల్దార్ల పాత్ర ఏ మేరకు ఉందన్న అంశంలో ఆరా తీస్తున్నారు. 

అలాగే, ఈ ఫ్రాడ్‌‌లో  మీ సేవ సెంటర్ల పాత్ర కూడా ఉందని జనగామలో తేలింది. దీంతో జిల్లాలోని మీ సేవ సెంటర్ల పాత్రపై అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి. పైగా పెద్ద ఎత్తున ఇంటర్‌‌‌‌నెట్​ సెంటర్లు, డాక్యుమెంట్​ రైటర్లు స్లాట్​ బుకింగ్​ చేస్తూ ఉండడంతో ఈ ఫ్రాడ్​లో వాటి నిర్వాహకుల పాత్ర కూడా ఉండవచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

పరిశీలించి.. ఆడిట్​ చేస్తే 

భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో పర్యవేక్షణ కొరవడడంతోనే ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని రెవెన్యూ ఆఫీసర్లు అంటున్నారు. ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్లను పరిశీలించి, ఆడిట్​ చేస్తే ఖజానాలో జమ చేయాల్సిన మొత్తం ఎంత? ఎంత జమ అయింది? అనేది తేలేదని చెబుతున్నారు. అయితే స్లాట్​ బుకింగ్​ రద్దయిన వారికి పేమెంట్  తిరిగి ఇవ్వడం లేదు. రిటన్​ చేసి ఉంటే ఈ చీటింగ్​ విషయం అప్పుడే బయటపడేదని రెవెన్యూ ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు. 

పూర్తి స్థాయిలో విచారణ చేస్తం..

స్లాట్​ బుకింగ్​ వ్యవహారంలో జరిగిన  చీటింగ్‌‌పై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తం. ఆర్డీవోలను విచారణాధికారులుగా నియమిస్తున్నం.  ప్రతి రిజిస్ట్రేషన్‌‌నూ నిశితంగా పరిశీలించి, ఏ స్థాయిలో ఫ్రాడ్​ జరిగిందో గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నం.  బాధ్యులైన వారి నుంచి డబ్బులు రికవరీ చేయడమే కాకుండా పీడీ యాక్ట్ , క్రిమినల్ కేసులు నమోదు  చేస్తం.  
‌‌‌‌- హనుమంతరావు, కలెక్టర్​, యాదాద్రి