వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా నాలుగేళ్ల క్రితం ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించిన మహి.వి.రాఘవ దీనికి సీక్వెల్గా ‘యాత్ర 2’ చిత్రాన్ని రూపొందించాడు. రాజశేఖర్ రెడ్డిగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, జగన్ పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటించారు. భారతిగా కేతకి నారాయణ్ కనిపించనున్నారు.
శివ మేక నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన ప్రెస్మీట్లో జీవా మాట్లాడుతూ ‘జగన్ గారి పాత్రలో నటించడం కష్టంగా అనిపించింది. ఆయన వీడియోలు చూస్తూ ఎలా మాట్లాడతారు.. ఎలా నడుస్తారు.. ఇలా ప్రతీ ఒక్క విషయం మీద శ్రద్ధ తీసుకున్నా. ఇందులోని ‘చూడు నాన్నా’ పాట చిత్రీకరిస్తున్నప్పుడు చాలా ఎమోషన్కు లోనయ్యాను’ అని అన్నాడు.
ఒక ఇమేజ్ ఉన్న రియల్ లైఫ్ క్యారెక్టర్లో నటించడం ఎక్సైటింగ్గా ఉందని చెప్పింది కేతకి. దర్శకుడు వి.రాఘవ మాట్లాడుతూ ‘తెలిసిన కథే అయినా.. సినిమాను ఎలా తీశాం, ఏ ఎమోషన్తో నడిపించామన్నది తెలియదు. ఈ చిత్రంలో వైఎస్సార్ మరణానికి సంబంధించిన కారణాలు చూపించలేదు. కేవలం ఓ తండ్రికి కొడుకు ఇచ్చిన మాట అనే పాయింట్ చుట్టూనే తిరుగుతుంది’ అని చెప్పాడు.