తెలంగాణలో పొగమంచుతో ఉక్కిరిబిక్కిరి .. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ​జారీ

తెలంగాణలో పొగమంచుతో ఉక్కిరిబిక్కిరి .. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ​జారీ

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో పొగమంచు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఉత్తర తెలంగాణలోని ఏజెన్సీ ఏరియాలతో పాటు.. దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉదయం10 దాటినా పొగమంచు పోవడం లేదు. దట్టంగా కమ్మేస్తున్న మంచుతో రోడ్ల మీద ముందు వెళ్లే వాహనాలు, ఎదురొచ్చే బండ్లు కనిపించడం లేదు. అర్ధరాత్రి 2 గంటల నుంచే పొగమంచు కమ్ముకుంటున్నది. మరో రెండు మూడు రోజుల పాటు పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, టెంపరేచర్లు పడిపోయే చాన్స్ ​ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

ఈ మేరకు శనివారానికి18 జిల్లాలకు ఎల్లో అలర్ట్​జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్​మల్కాజిగిరి, మెదక్​ జిల్లాల్లో పొగమంచు తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. పలు జిల్లాల్లో పగటిపూట టెంపరేచర్లు 30 డిగ్రీలలోపే నమోదవుతాయని తెలిపింది. జనవరి మొదటి వారంలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్టు అధికారులుచెప్తున్నారు. 

15 డిగ్రీల లోపే రాత్రి టెంపరేచర్లు

మరోవైపు తెలంగాణ స్టేట్​డెవలప్​మెంట్​ప్లానింగ్​సొసైటీ(టీఎస్​డీపీఎస్) ప్రకారం గురువారం రాత్రి టెంపరేచర్లు సూర్యాపేట, హైదరాబాద్​మినహా మిగతా జిల్లాల్లో 15 డిగ్రీలలోపు నమోదయ్యాయి. అత్యల్పంగా వికారాబాద్​ జిల్లా మర్పల్లిలో 10.4 డిగ్రీల నైట్​ టెంపరేచర్​ రికార్డయింది. రంగారెడ్డి జిల్లా షాబాద్​లో 10.9, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలోని సిర్పూర్​లో 11, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, ఆదిలాబాద్​ జిల్లా బజార్​హత్నూర్​లలో 11.6, మహబూబ్​నగర్​ జిల్లా బాలానగర్​లో 12, నాగర్​కర్నూల్ ​జిల్లా బాల్మూరు, కామారెడ్డి జిల్లా జుక్కల్​లలో 12.4, మెదక్​ జిల్లా ఎల్దుర్తి, జోగులాంబ గద్వాల్​లో12.6, నిర్మల్​ జిల్లా పెంబి, సిద్దిపేట జిల్లా కొండపాకల్లో 12.7, మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్​లో 12.8, నల్గొండ జిల్లా చింతపల్లిలో 13 డిగ్రీల చొప్పున కనీస ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

నీటి ఆవిరి ఎక్కువగా ఉండటం వల్లే

వాతావరణంలో నీటి ఆవిరి ఎక్కువగా ఉండటం వల్ల పొగ మంచు తీవ్రత పెరుగుతున్నదని వాతావరణ శాఖ సైంటిస్ట్​ డాక్టర్ ​శ్రావణి తెలిపారు. రాత్రి టెంపరేచర్లు తక్కువగా నమోదవుతుండటం వల్ల నీటి ఆవిరి పొగమంచులాగా మారుతున్నదని పేర్కొన్నారు. నీటి ఆవిరి వంద శాతానికి పైగానే ఉంటుండటంతో పొగమంచు దట్టంగా అలుముకుంటున్నదని, ఫలితంగా అరకిలోమీటరు దూరంలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడుతున్నదని చెప్పారు. వీలైనంత వరకు తెల్లవారుజామున ప్రయాణాలను మానుకుంటేనే మంచిదని ఆమె సూచించారు.