న్యూఢిల్లీ : యెస్ బ్యాంక్కు ఈ ఏడాది సెప్టెంబర్తో ముగిసిన క్వార్టర్ (క్యూ2) లో రూ. 228.64 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్లో ప్రకటించిన రూ.160.41 కోట్లతో పోలిస్తే ఇది 47 శాతం గ్రోత్కు సమానం. కానీ, ఈ ఏడాది జూన్ క్వార్టర్లో వచ్చిన రూ.347 కోట్లతో పోలిస్తే మాత్రం బ్యాంక్ ప్రాఫిట్ తగ్గింది. క్యూ2 లో యెస్ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ.1,925 కోట్లుగా రికార్డయ్యింది.
బ్యాంక్ ఇచ్చిన లోన్లు ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 11 శాతం పెరిగినప్పటికీ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ (ఎన్ఐఎం) 0.30 శాతం తగ్గి 2.3 శాతానికి పడిపోయాయి. డిపాజిట్లపై వడ్డీ మారడంతో పాటు, ప్రయారిటీ లెండింగ్ సెక్టార్లో వడ్డీ రేట్లు తగ్గడంతో మార్జిన్స్ పడిపోయాయని యెస్ బ్యాంక్ ప్రకటించింది. ఎన్ఐఎం ఇక పడదని బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. సమీప భవిష్యత్లో పెరుగుతుందని అంచనావేశారు.
డిపాజిట్లపై వడ్డీల మార్పు మళ్లీ జరగదని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లోన్ బుక్ 15 శాతం, డిపాజిట్లు 18 శాతం పెరుగుతాయని ప్రశాంత్ కుమార్ అన్నారు. ఆన్సెక్యూర్డ్ లోన్ల గురించి ఆయన మాట్లాడారు. లోన్లను చెల్లించకుండా ఎగ్గొడుతున్నవారు పెరుగుతున్నారని, 30 రోజుల కంటే ఎక్కువ కాలం పాటు ఓవర్ డ్యూగా ఉన్న లోన్లు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అయినప్పటికీ ఇవి ఇంకా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్పీఏ) గా మారలేదని చెప్పారు. యెస్ బ్యాంక్ గ్రాస్ ఎన్పీఏల రేషియో క్యూ2 లో 2.1 శాతంగా రికార్డయ్యింది. రిటైల్ లోన్లపై స్పెషల్ ఫోకస్ పెట్టామని ప్రశాంత్ పేర్కొన్నారు. బ్యాంక్ సెప్టెంబర్ క్వార్టర్లో రూ.505 కోట్లను ప్రొవిజన్ల కోసం పక్కన పెట్టింది.