అయోధ్య ఆ రోజు మొత్తం మందు బంద్

అయోధ్య ఆ రోజు మొత్తం మందు బంద్

అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామాలయానికి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయానికి దగ్గర్లోని 100 కోసి పరిధిలో మద్యం విక్రయాలపై నిషేధం విధించింది. పవిత్ర నగరంలో రామ మందిర ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌ తో సమావేశం అనంతరం.. యూపీ ఎక్సైజ్ మంత్రి నితిన్ అగర్వాల్ ఈ విషయాన్ని ప్రకటించారు. 84 కోసి పరిక్రమ మార్గ్‌ను మద్యం నిషేధిత ప్రాంతంగా కూడా ప్రకటించారు. పవిత్ర నగరమైన అయోధ్యలో మద్యం నిషేధించే నిర్ణయం కొత్తదేం కాదు. ఇది 2018 నాటిది. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఫైజాబాద్ జిల్లాను అయోధ్యగా పేరు మార్చింది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలోని దర్శనీయులు, సాధువులు స్థలం పవిత్రతను కాపాడటానికి మద్యంతో పాటు మాంసాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.

2022లో జూన్‌లో యోగి ప్రభుత్వం అయోధ్య, మథురలోని ఆలయాల్లో మద్యం అమ్మకాలను నిషేధించింది. అయోధ్యలోని రామ మందిరం, మథురలోని కృష్ణ జన్మభూమి రెండు ప్రదేశాలలో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటు అధికారులు అయోధ్యలోని మద్యం విక్రయదారుల లైసెన్స్‌లను రద్దు చేశారు. దేవాలయాలకు సమీపంలో ఉన్న 37 మద్యం, బీరు, భాంగ్ దుకాణాలను మూసివేయాలని మథుర అధికారులను ఆదేశించింది.