మాటల్లో పెట్టి బ్రాస్లెట్మాయం చేసిండు.. ఇద్దరు స్నాచర్లను పట్టుకున్న పోలీసులు

మాటల్లో పెట్టి బ్రాస్లెట్మాయం చేసిండు.. ఇద్దరు స్నాచర్లను పట్టుకున్న పోలీసులు

గచ్చిబౌలి, వెలుగు: క్యాబ్​ కోసం ఎదురుచూస్తున్న ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని ఓ యువకుడు మాటల్లో పెట్టి ఆమె చేతికున్న బ్రాస్​లెట్​ మాయం చేశాడు. మరో స్నేహితుడితో కలిసి పరారయ్యాడు. స్నాచింగ్​ ఘటనలో పాల్గొన్న ఇద్దరు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్​ చేశారు. మాదాపూర్​ డీసీపీ మీటింగ్​ హాల్​లో ఏసీపీ శ్రీధర్​ వివరాలను వెల్లడించారు. మలక్​పేట్​ ఉస్మాన్​పురాకు చెందిన బిక్కుల నరేందర్​(24) ఈవెంట్​ మేనేజ్​మెంట్​ఉద్యోగి. కాచిగూడ రాంకోటికి చెందిన ఆశీష్​కుమార్​(24) పెంపుడు జంతువుల గ్రూమింగ్​ఉద్యోగం చేస్తున్నాడు. 

వీరిద్దరూ స్నేహితులు. ఈజీ మనీ కోసం  దొంగతనాలు చేయాలని డిసైడ్​ అయ్యారు. ఈ నెల 15న వీరిద్దరు బైక్​పై గచ్చిబౌలికి వచ్చారు. అమెజాన్​ సాఫ్ట్​వేర్​ కంపెనీ ఎదుట క్యాబ్​ కోసం వేచి ఉన్న ఐటీ ఉద్యోగిని రేలాగౌడ్ దగ్గరికి నరేందర్​ వెళ్లాడు. ఉద్యోగం కోసమని అమెను మాటల్లో పెట్టాడు. ఆమె చేతికున్న 6 తులాల బంగారు బ్రాస్​లెట్​ను అపహరించి బైక్​తో సిద్ధంగా ఉన్న అశీష్​కుమార్​తో కలిసి అక్కడి నుంచి పరారయ్యాడు. 

గచ్చిబౌలి పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. బుధవారం నరేందర్​, అశీష్​కుమార్​ను అరెస్ట్​ చేసి బ్రాస్​లెట్​ను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో గచ్చిబౌలి ఇన్​స్పెక్టర్​ హబిబుల్లాఖాన్​,  డిటెక్టివ్​ ఇన్​స్పెక్టర్​ నరేశ్ పాల్గొన్నారు.