
గండిపేట, వెలుగు: ఓ యువకుడు ఓ మహిళతో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తరచూ ఇంటికి వెళ్లి వచ్చేవాడు. ఆమెతో ఈ మధ్య గొడవలు రావడంతో.. సదరు మహిళ కొడుకు ఆ యువకుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం..
ఉప్పర్పల్లి ఫోర్ట్ వ్యూ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో యూసిర్ షరీఫ్(29) అనే యువకుడు నివాసముంటున్నాడు. ఈయన ఓ యూట్యూబ్ చానల్లో రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా ఓ మహిళతో రిలేషిన్షిప్లో ఉన్నాడు. సదరు మహిళ భర్త చనిపోగా ఆమెకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ఈ మధ్య యువకుడికి, మహిళకు తురచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం తన అపార్ట్మెంట్లో ఉన్న యూసిర్ షరీఫ్ దారుణ హత్యకు గురయ్యాడు. సదరు మహిళ పెద్ద కొడుకు కత్తితో దాడి చేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. అయితే వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ, హత్యకు పాల్పడిన ఆమె కొడుకు వివరాలను పోలీసులు వెల్లడించలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. డెడ్బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చరీకి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.