కుషాయిగూడ, వెలుగు: పెళ్లి ఇష్టం లేక యువతి సూసైడ్ చేసుకున్న ఘటన కుషాయిగూడ పీఎస్ పరిధిలో జరిగింది. చిన్నచర్లపల్లిలో ఉండే మోహన్ దంపతులకు పిల్లలు లేరు. 11 ఏండ్ల క్రితం భార్య అక్క చనిపోవడంతో ఆమె కూతురు స్వాతి(19)ని మోహన్ దంపతులు దత్తత తీసుకున్నారు. స్వాతి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది. స్వాతికి పెళ్లి చేసేందుకు మోహన్ దంపతులు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. కానీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని స్వాతి వారితో చెప్పింది. శనివారం ఉదయం మోహన్ దంపతులు ఆఫీసుకు వెళ్లారు. 11 గంటలకు మోహన్ తిరిగి ఇంటికి రాగా డోర్ లోపలి నుంచి లాక్ చేసి ఉంది. డోర్ పగులగొట్టి అతడు లోపలికి వెళ్లి చూడగా.. బెడ్రూంలో స్వాతి చున్నీతో ఉరేసుకుని కనిపించింది. కుషాయిగూడ పోలీసులు డెడ్ బాడీని హాస్పిటల్కి తరలించారు. పెళ్లి ఇష్టం లేక స్వాతి ఆత్మహత్య చేసుకుందా లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
భార్యాపిల్లలు వదిలి వెళ్లారనే మనస్తాపంతో..
భార్యా పిల్లలు వదిలేసి వెళ్లిపోయారనే మనస్తాపంతో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన కుషాయిగూడ పీఎస్ పరిధిలో జరిగింది. చిన్నచర్లపల్లిలో ఉండే సంపత్ కుమార్(43) కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన సంపత్ రోజు భార్య సునీతతో గొడవపడేవాడు. సునీత ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయి జగద్గిరిగుట్టలో ఉంటోంది. సంపత్ కొంతకాలం బాలాజీనగర్ బృందావన్ కాలనీలో తల్లి పుష్ప దగ్గర ఉన్నాడు. ఇటీవల చర్లపల్లిలో రూమ్ తీసుకుని ఒక్కడే ఉంటున్నాడు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతోన్న సంపత్.. భార్యాపిల్లలు వదిలేసి వెళ్లారనే మనస్తాపంతో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మహంకాళి టెంపుల్ వెనుక ఉన్న చెట్లపొదల్లో సూసైడ్ చేసుకున్నాడు. అక్కడికి చేరుకున్న తల్లి పుష్పను పోలీసులు ఆరా తీయగా.. సంపత్ ఆరోగ్యం బాలేదని, భార్యాపిల్లలు వదిలివెళ్లడంతో మానసిక ఆవేదనకు లోనయ్యాడని చెప్పింది. పోలీసులు డెడ్ బాడీని గాంధీకి తరలించారు.