న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సంవత్సరంలో తమ దేశంలో వలసలను నిరోధించేందుకు మరిన్ని కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. తమ దేశంలో నివాసం ఉంటున్న వలసదారులు అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, భారీ జరిమానాలు విధిస్తామని ఇండియాలోని అమెరికా ఎంబసీ హెచ్చరించింది. ఈ మేరకు ‘ఎక్స్’ లో ఓ ప్రకటన చేసింది. ఇతర దేశాల నుంచి యూఎస్ లోకి అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయడానికి ట్రంప్ చర్యలు తీసుకుంటున్నారని, ఈ విషయంలో ఆయన అత్యంత సీరియస్ గా ఉన్నారని యూఎస్ ఎంబసీ ఆ ప్రకటనలో వెల్లడించింది.
‘‘అమెరికాలో ఉంటున్న వలసదారులూ.. జాగ్రత్త! మా దేశ చట్టాలను ఉల్లంఘిస్తే, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. మీపై అత్యంత కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. భారీగా జరిమానాలు కూడా వేస్తం. మా దేశాన్ని, మా దేశ సరిహద్దులను, పౌరులను అక్రమ వలసదారుల నుంచి కాపాడేందుకు మా అధ్యక్షుడు ట్రంప్ కమిట్మెంట్ తో పనిచేస్తున్నారు” అని స్పష్టం చేసింది. కాగా, ప్రస్తుతం హెచ్1బీ, హెచ్4 వీసాల అపాయింట్మెంట్ లేట్ అయినందున భారత్ లో వేల మంది చిక్కుకున్నారు. అలాగే ఇమిగ్రేషన్, బార్డర్ సంబంధిత ఫీజునూ పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకుంది. ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ లో భాగంగా యాన్యువల్ అడ్జస్ట్ మెంట్ కింద ఇమిగ్రేషన్, బార్డర్ రిలేటెడ్ ఫీజును గురువారం పెంచింది.
