అట్టహాసంగా పాలకవర్గం ప్రమాణ స్వీకారం 

అట్టహాసంగా పాలకవర్గం ప్రమాణ స్వీకారం 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  జిల్లాలో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్​ మేయర్​గా సీపీఐ పార్టీకి చెందిన మూడ్​ గణేష్​,డిప్యూటీ మేయర్​గా కాంగ్రెస్​కు చెందిన సిరిపురం లలిత ఎన్నికయ్యారు. కార్పొరేషన్లో 60 డివిజన్లకు  కాంగ్రెస్​ 22, సీపీఐ 22, బీఆర్​ఎస్​ 8, సీపీఎం ఒకటి, బీజేపీ ఒకటి, ఆరుగురు ఇండిపెండెంట్లు గెలిచారు. కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్​ ఆఫీస్​లో సోమవారం అడిషనల్​ కలెక్టర్​ డి. వేణుగోపాల్​ మొదట  52 మందితో  ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మేయర్​, డిప్యూటీ మేయర్​ ఎన్నికకు అడిషనల్​ కలెక్టర్​ కాల్​ చేశారు. బీఆర్​ఎస్​కు చెందిన ఎనిమిది కార్పొరేటర్లు మేయర్​, డిప్యూటీ మేయర్​ ఎన్నికను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి ప్రమాణ స్వీకారోత్సవానికి అటెండ్​ కాలేదు.  

ఏకగ్రీవంగా మేయర్​, డిప్యూటీ మేయర్​ ఎన్నిక.

కొత్తగూడెం  కార్పొరేషన్​ మేయర్​, డిప్యూటీ మేయర్లను కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్​, సీపీఐ పొత్తు పెట్టుకున్నాయి. చెరో రెండున్నరేండ్లు పాలన సాగించేలా ఇరు పార్టీలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ క్రమంలో మేయర్​గా సుజాతనగర్​ నుంచి కార్పొరేటర్​గా గెలిచిన సీపీఐ పార్టీకి చెందిన మూడ్​ గణేష్​ను కార్పొరేటర్​ అడుసుమల్లి సాయిబాబు ప్రతిపాదించగా, ఇండిపెండెంట్​ అభ్యర్థి కంబంపాటి దుర్గా ప్రసాద్​ బలపర్చారు.

డిప్యూటీ మేయర్​గా పాల్వంచ నుంచి గెలిచిన సిరిపురం లలితను కాంగ్రెస్​ పార్టీకి చెందిన కె. శ్రీనివాస్​ ప్రతిపాదించగా, సీపీఐకి చెందిన బోయిన విజయ్​ కుమార్​ బలపర్చారు. ఇతరులెవరూ పోటీ లేకపోవడంతో మూడ్​ గణేష్​, సిరిపురం లలితలను మేయర్​, డిప్యూటీ మేయర్​లుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అడిషనల్​ కలెక్టర్​ ప్రకటించి,  ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికైన అనంతరం ఇద్దరూ సభలోనే ఉన్న ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుల వద్దకు వెళ్లి ఆశీర్వాదం పొందారు.  

రాజకీయ వేదికగా రైస్​ గ్రాండ్​ రెస్టారెంట్​ నగరంలోని రైస్​ గ్రాండ్​ రెస్టారెంట్​​ కాంగ్రెస్​, సీపీఐ క్యాంపు రాజకీయాలకు వేదికగా మారింది. పలు ప్రాంతాల్లోని క్యాంపులకు తరలి వెళ్లిన కాంగ్రెస్​, సీపీఐ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారానికి ముందుగా రైస్​ గ్రాండ్​ రెస్టారెంట్​లో దిగారు. ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, సీపీఐ రాష్ట్ర నేత పల్లా వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి ఎస్​కె. సాబీర్​ పాషాతో చర్చించారు. మేయర్​, డిప్యూటీ మేయర్​ పదవులకు నామినేషన్​ వేసిన క్రమంలో ఎవరు బలపర్చాలి, ఎవరు ప్రతిపాధించాలో దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా 11 గంటలకు కార్పొరేషన్​ ఆఫీసుకు రావాల్సి ఉండగా దాదాపు అరగంటకు పైగా రెస్టారెంట్​లోనే  కార్పొరేటర్లు ఉండటంతో  కొంత ఉత్కంఠ నెలకొంది.