
- ఆడిషన్స్లో సెలక్ట్ అయ్యారని చెప్పి కాస్ట్యూమ్ డిజైనింగ్ పేరుతో డబ్బులు వసూలు
- ఇద్దరు అరెస్ట్.. రూ.15 లక్షల 60 వేల క్యాష్ సీజ్
‘సిటీలోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ర్యాంప్వాక్లు ఏర్పాటు చేస్తరు. అక్కడికి వచ్చే చిన్నారులను అట్రాక్ట్ చేసి యాడ్స్, మోడలింగ్లో చాన్స్ ఇప్పిస్తామంటూ నమ్మిస్తరు. తర్వాత కాంటాక్ట్ నంబర్లను సేకరించి వాట్సాప్లో చిన్నారుల తల్లిదండ్రులతో ఇంట్రాక్ట్ అవుతారు. మీ పిల్లలను ఆడిషన్లకు తీసుకురావాలని వారికి చెబుతారు. హీరోయిన్ రష్మిక మందన్నతో మీ పిల్లలు యాడ్స్లో నటించే చాన్స్ కొట్టేసారని చెప్పి.. మోడలింగ్ వెబ్ సైట్లో చూపిస్తరు. కాస్ట్యూమ్స్ డిజైనింగ్ కోసం డబ్బులు కావాలని ఆన్ లైన్లో ట్రాన్స్ఫర్ చేయించుకుంటరు. కాస్మోపాలిటన్ మోడల్ ఏజెన్సీ పేరుతో ఫేక్ వెబ్ సైట్ రన్ చేస్తున్న మోడల్తో పాటు అతడి భార్యను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గచ్చిబౌలి, వెలుగు: చిన్నారులకు యాడ్స్, మోడలింగ్లో అవకాశం కల్పిస్తామంటూ మోసం చేస్తున్న ఇద్దరిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మదీనాగూడకు చెందిన గోపాలకృష్ణన్ కృష్ణానంద్ గతేడాది డిసెంబర్లో తన కూతురి బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీతో కలిసి గచ్చిబౌలి లోని శరత్ సిటీ మాల్కు వెళ్లాడు. అదే టైమ్లో కాస్మోపాలిటన్ మోడల్ ఏజెన్సీ నిర్వాహకులు అక్కడ ర్యాంప్ వాక్ నిర్వహించారు. మాల్కు వచ్చిన చిన్నారుల్లో కొందరిని సెలక్ట్ చేసి వారితో ర్యాంప్ వాక్ చేయించారు. మోడలింగ్, యాడ్స్ లో ఇంట్రెస్ట్ ఉందా అని కృష్ణానంద్ కుమార్తెను నిర్వాహకులు అడగగా.. ఆ చిన్నారి ఓకే చెప్పింది. దీంతో ఏజెన్సీ నిర్వాహకులు కృష్ణానంద్ కాంటాక్ట్ నంబర్ తీసుకుని వాట్సాప్లో కూపన్ కోడ్ పంపించారు. మీ కూతురి ఫొటోలు పంపించాలని కోరగా.. కృష్ణానంద్ వాట్సాప్లో సెండ్ చేశాడు. తర్వాత మేఘన అనే యువతి కృష్ణానంద్కు కాల్ చేసి.. దేశంలోని వివిధ సిటీల నుంచి 20 మంది చైల్డ్ మోడల్స్ను ఫ్యాషన్ షోస్, అడ్వర్టైజ్ మెంట్స్ కోసం సెలక్ట్ చేశామని.. డిసెంబర్ 17న అదే మాల్లో ఫైనల్ ఆడిషన్ ఉంటుందని చెప్పింది. అమ్మాయిని రెడ్ డ్రెస్లో తీసుకురావాలని తెలిపింది. కృష్ణానంద్ 17న తన కూతురిని తీసుకుని మాల్కు వెళ్లాడు. అక్కడ చిన్నారి ర్యాంప్ వాక్ చేయగా.. అదే రోజు రాత్రి మీ కుమార్తె మోడలింగ్కు సెలక్ట్ అయ్యిందని నిర్వాహకులు వాట్సాప్ మెసేజ్ పంపించారు. ఆ తర్వాత కృష్ణానంద్కు మేఘన ఫోన్ చేసి తన హెడ్ డాక్టర్ అమిత్ మీకు వాట్సాప్ కాల్ చేస్తారని చెప్పింది. డిసెంబర్ 20న అమిత్ పేరుతో ఓ వ్యక్తి కృష్ణానంద్కు కాల్ చేశాడు. మీ కుమార్తె ఓరియో బిస్కెట్ నేషనల్ యాడ్కు సెలక్ట్ అయ్యిందని.. హీరోయిన్ రష్మిక మందన్నాతో కలిసి యాక్ట్ చేయనుందని చెప్పాడు. ఈ యాడ్ కాస్ట్యూమ్స్ కోసం డిజైనర్ రీతుకుమార్కు రూ.3 లక్షల 25 వేలు డిపాజిట్ చేయాలన్నాడు. ఇది నమ్మిన కృష్ణానంద్ అతడు చెప్పిన విధంగా వివిధ బ్యాంక్ అకౌంట్లకు విడతల వారీగా రూ. 14 లక్షల 12 వేలు పంపించాడు. యాడ్స్, మోడలింగ్ పేరుతో ఫేక్ వెబ్సైట్తో కాస్మోపాలిటన్ మోడల్ ఏజెన్సీ నిర్వాహకులు మోసం చేసినట్లు గుర్తించిన కృష్ణానంద్ ఈ నెల 4న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.
విదేశాల్లో చదువులు.. ఇక్కడ మోసాలు..
పుణెలోని రాంనగర్ కాలనీకి చెందిన అపూర్వ అశ్విన్ అలియాస్ అర్జున్ కపూర్(47) యూఎస్లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో 1998లో మార్కెటింగ్లో ఎంఎస్ చేశాడు. తర్వాత ఇండియాకు వచ్చి మోడలింగ్, డైరెక్షన్, యాక్టింగ్ వైపు వెళ్లాడు. 20 ఏండ్లుగా మోడలిం
గ్లో ఉన్నాడు. బాలీవుడ్ మూవీస్ రెండింటిలో యాక్ట్ చేశాడు. తర్వాత జల్సాలకు బానిసయ్యాడు. చిన్నారులతో మోడలింగ్, ఫ్యాషన్ షో నిర్వహిస్తే పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించవచ్చిన స్కెచ్ వేశాడు. తర్వాత చిన్నారులకు మోడలింగ్, యాడ్స్లో నటించే చాన్స్ ఇప్పిస్తానంటూ వారి తల్లిదండ్రులను మోసం చేసి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. గతంలో ముంబయి పోలీసులు అపూర్వను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత తన పేరును అశ్విన్ నుంచి అర్జున్ కపూర్గా
మార్చుకున్నాడు. ముంబయికి చెందిన నజీశ్ మీమన్ అలియాస్ నటాషా కపూర్(26) పెండ్లి చేసుకున్నాడు. తనతో పాటు మోడలింగ్లో పనిచేసేందుకు ఆమె పేరును సైతం మార్చేశాడు.
బడా షాపింగ్ మాల్స్ టార్గెట్గా..
అపూర్వ అశ్విన్ మోడలింగ్ ఏజెన్సీ పేరుతో వెబ్ సైట్ను క్రియేట్ చేసి మెట్రో సిటీస్లోని బడా షాపింగ్ మాల్స్కు వెళ్లేవాడు. మాల్స్ మేనేజర్లతో వాట్సాప్, మెసెంజర్లలో కాంటాక్ట్ అయ్యేవాడు. మాల్స్లో చిల్డ్రన్ ర్యాంప్ వాక్ నిర్వహించేందుకు పర్మిషన్ తీసుకునేవాడు. ఆ తర్వాత ఇండెడ్. కామ్ వెబ్సైట్లో ఫ్యాషన్ డిజైన్ కోర్సు చేసి ఉద్యోగం కోసం చూస్తున్న వారిని సెలక్ట్ చేసేవాడు.
మాల్స్లో ర్యాంప్ వాక్ నిర్వహిస్తే మంచి శాలరీ ఇస్తానని చెప్పేవాడు. ఇతడి దగ్గర చేరిన వారు మాల్స్కు వచ్చే పిల్లలను టార్గెట్ చేసి వారితో ర్యాంప్వాక్ చేయించేవారు. తర్వాత సినిమా హీరోలు, క్రికెటర్లతో కలిసి యాడ్స్లో, మోడలింగ్లో యాక్ట్ చేసే అవకాశం కల్పిస్తామని పిల్లల తల్లిదండ్రులకు చెప్పేవారు. ఈ ఫ్రాడ్లో మేఘన పేరుతో నటాషా కపూర్ చిన్నారుల తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడేది. తర్వాత అమిత్ పేరుతో అపూర్వను పరిచయం చేసేది. ప్యాకేజీ, కాస్ట్యూమ్స్, మేకప్ కిట్స్ చార్జీల పేరుతో చిన్నారుల తల్లిదండ్రుల నుంచి అపూర్వ పెద్దఎత్తున అకౌంట్లలో డబ్బును డిపాజిట్చేయించుకునేవాడు. రాజస్థాన్లోని జైపూర్, అజ్మీర్ సిటీల్లో షాప్ ఓనర్లకు చెందిన బ్యాంక్ అకౌంట్లను వారికి కమీషన్ ఇచ్చి అపూర్వ తీసుకునేవాడు. అందులోనే చిన్నారుల తల్లిదండ్రులతో డబ్బు డిపాజిట్ చేయించేవాడు. ఆ తర్వాత తన మొబైల్ను స్విచాఫ్ చేసేవాడు. బాధితుల కంప్లయింట్లతో కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అపూర్వ అశ్విన్, నటాషా కపూర్ ను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.15 లక్షల 60 వేల క్యాష్, 4 ఐఫోన్లు, ల్యాప్ టాప్, ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అపూర్వపై సైబరాబాద్ పరిధిలో 4 , బెంగళూరులో ఓ కేసు ఉందని పోలీసులు తెలిపారు.
బాచుపల్లిలోనూ కేసు..
జీడిమెట్ల: ప్రగతినగర్కు చెందిన అరుణ్కుమార్ (28) ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. తన ఫ్యామిలీతో కలిసి గతేడాది డిసెంబర్ 18న గచ్చిబౌలిలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్కు వెళ్లాడు. అక్కడ చిన్నారుల ర్యాంప్ వాక్ను చూసిన అరుణ్ తన బాబును సైతం అందులో పార్టిసిపేట్ చేయించాడు. ఫొటోలు తీయించాడు. నిర్వాహకులు వాట్సాప్ ద్వారా అరుణ్తో కాంటాక్ట్ అయ్యి ఫైనల్ ఆడిషన్లకి బాబును తీసుకుని రావాలని చెప్పారు. అరుణ్ తన కొడుకుని ఆడిషన్స్కు తీసుకెళ్లాడు. ‘మీ బాబుకు యాడ్స్ లో నటించే చాన్స్ వచ్చింది’ అంటూ నిర్వాహకులు అరుణ్తో చెప్పి మెంబర్ షిప్, జీఎస్టీ పేరుతో డిసెంబర్ 25న రూ.44,800 వేలు వసూలు చేశారు. తర్వాత బాలీవుడ్ డిజైనర్తో కాస్ట్యూమ్స్ డిజైనింగ్ చేయిస్తామని.. ఇందుకోసం రూ.3 లక్షల 25 వేలు చెల్లించాలన్నారు. మోసపోయినట్లు గుర్తించిన అరుణ్ ఈ నెల 20న బాచుపల్లి పోలీసులకు కంప్లయింట్ చేశాడు.