
బషీర్బాగ్, వెలుగు: ఓల్డ్ సిటీలో ఓ యువకుడిపై దుండగులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. భవానీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలబ్ కట్టా ప్రాంతానికి చెందిన మహమ్మద్ సాబేర్(30) ఆటో మెకానిక్ గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి నమాజ్ అయ్యాక మసీదు సమీపంలో ఆటోలో కూర్చున్నాడు. అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన సాబేర్ను స్థానికులు ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
బాధితుడిపై గతంలో పీడీయాక్ట్ ఉందని, రెండేళ్ల క్రితమే దాన్ని ఎత్తివేసినట్లు సీఐ బాలస్వామి తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేశామని, సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు.