ఓటమి భయంతో కేసీఆర్ కుట్ర రాజకీయాలు : వైఎష్ షర్మిల

ఓటమి భయంతో కేసీఆర్ కుట్ర రాజకీయాలు : వైఎష్ షర్మిల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో కేసీఆర్ కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ఆరోపించారు. ప్రత్యర్థులను నైతికంగా ఎదుర్కొనే దమ్ము లేక అధికారాన్ని వాడుకుని ఐటీ దాడులకు పాల్పడుతున్నారని ఎక్స్ (ట్విట్టర్ ) ద్వారా విమర్శలు చేశారు. ఎన్నికల్లో గెలిచే సత్తా లేక కాంగ్రెస్ నాయకులపై ఐటీ, ఈడీ సోదాలు జరిపిస్తూ కేసీఆర్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాయం చేస్తున్నారని చెప్పారు. ఎన్ని డ్రామాలు ఆడినా బీఆర్ఎస్, బీజేపీ ఒకే తానుముక్కలన్న సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అన్నారు. 

గల్లీలో కుస్తీ పడుతూ.. ఢిల్లీలో దోస్తీ నడిపే తెరచాటు రాజకీయాలకు ఈ ఎన్నికలే గుణపాఠం అవుతాయన్నారు వైఎస్ షర్మిల. సోదాల పేరుతో కాంగ్రెస్ నాయకులను, వారి మద్దతుదారులను ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ పై ఎలాంటి విచారణ ఉండదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అవినీతి చేసిన కేసీఆర్ బిడ్డపై ఎలాంటి చర్యలు తీసుకోరు అని అన్నారు. 

భూకబ్జాలతో అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డ బీఆర్ఎస్ బందిపోట్లపై ఐటీ,ఈడీ సోదాలు జరగవు అన్నారు. కేసీఆర్, మోదీల చీకటి ఒప్పందాలకు ఇంత కన్నా నిదర్శనం ఏముంటుంది..? అని ప్రశ్నించారు. ప్రజలు అధికారం కట్టబెట్టింది ప్రజలకు సేవ చేయమని గానీ ప్రతిపక్షాలను అణగదొక్కమని కాదు అన్నారు. మరికొద్ది రోజుల్లో కేసీఆర్, మోదీల పాలనకు తెలంగాణ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని ట్విట్టర్ లో పోస్టు చేశారు.